హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లక్షలాది సీసీ కెమెరాల నిఘా కొనసాగుతున్నది. చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతోంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్పై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇందులో భాగంగా నగరాన్ని సీసీ కెమెరాలతో నిఘా నీడల్లోకి తీసుకొచ్చారు. అత్యధిక సీసీ కెమెరాలను కల్గి ఉన్న నగరంగా దేశంలోనే హైదరాబాద్కు మొదటి స్థానం దక్కింది. ఒక పక్క నేరాలను అదుపు చేయడం.. మరో పక్క నేరాలు జరగకుండా అడ్డుకోవడంలో సీసీ కెమెరాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. సంచలనాత్మకమైన కేసుల్లో పోలీసులకు క్లూ ఇస్తున్నాయి. గతంలో నెలలు, సంవత్సరాలు పట్టే కేసుల దర్యాప్తు.. నేడు గంటల వ్యవధిలోనే తేలిపోతున్నాయి.
నేరం చేసే వాడికి శిక్ష పడాలి.. నేరం చేయని వారికి అవి రక్షణగా ఉండాలనే లక్ష్యంతో టెక్నాలజీ పరమైన సంస్కరణలను ప్రభుత్వం తీసుకురావడంతో నేడు వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరి లో ఇప్పటి వరకు 3.8 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు కాగా… ఈ ఏడాది చివరినాటికి ఐదు లక్షల కెమెరాల ఏ ర్పాటును పూర్తి చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ కమి షనరేట్ పోలీసులు ముందుకు సాగుతున్నారు. నగరంపై నిరంతరం నిఘా ఉంచుతూ ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో సీసీ కెమెరాలు ఇప్పుడు ఎంతో కీలకంగా మారాయి. సీసీ కెమెరాలతో అంతర్రాష్ట్ర దొంగలు ఇప్పుడు హైదరాబాద్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ వస్తే దొరికిపోతామనే భయం వారిలో ఉంది.. గతంలో స్నాచింగ్లు ఎక్కువగా జరిగేవి.. నేడు చాలా వరకు తగ్గా యి.. ఎవరైనా స్నాచింగ్ గానీ, దొంగతనాలకు గానీ పాల్పడితే.. వెంటనే పోలీసులు పట్టుకుంటున్నారు. పోలీసులు టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరగాళ్లను పట్టేస్తున్నారు.
రెండు దశాబ్దాల్లో.. దొంగతనాల్లో మూడు సెంచరీలు పూర్తి చేసుకున్న దొంగలను హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, ఓల్డ్ గుంటూరు పట్టణానికి చెందిన పుల్లేటికుర్తి ఉమామహేశ్వరరావుపై 300 కేసులుండగా, మచిలీపట్నానికి చెందిన ఆరేపల్లి దుర్గారావు అలియాస్ దుర్గాపై 100 దొంగతనం కేసులు, గుంటూర్కు చెందిన కిరణ్బాబుపై 30 కేసులు ఉన్నాయి. వీళ్లంతా జైల్లో స్నేహాలు చేసూ..బెయిల్పై బయటకు వచ్చి ఈ ఏడాది సంక్రాంతి సెలవుల సందర్భంగా నగరంలో దొంగతనాలు చేశారు. దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను విశ్లేషించిన పోలీసులు ఈ దొంగల ముఠాను పట్టుకున్నారు. అలాగే.. జీపీఎస్, క్యూఆర్ కోడ్ ఆధారంగా నడిచే రెంటల్ సర్వీసెస్ బైక్లకు సంబంధించిన జీపీఎస్లను తొలిగించి వాటిని మెట్రో స్టేషన్ల వద్ద నుంచి అపహరిస్తున్న ముఠాను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో వోగా కంపెనీకి చెందిన రూ. 30 లక్షల విలువ చేసే 38 బైక్లను దొంగిలించిన యాసిన్, మీర్ హమ్జా, మహ్మద్ వాజిత్ తదితరులను అరెస్ట్ చేశారు.
ఏదైనా ఒక ఘటన జరిగిందంటే ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు వందలాది సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల విశ్లేషణకు ప్రత్యేక బృందాన్ని ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దింపుతున్నారు. ఇటీవల అబిడ్స్ ఠాణా పరిధిలో మూడేండ్ల బాలుడు కిడ్నాప్నకు గురయ్యాడు. ఈ కేసును ఛేదించేందుకు హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు సిటీ నుంచి మహారాష్ర్టలోని మాలేగావ్కు మధ్య ఉన్న 800 కి.మీ పొడవునా ఉన్న సీసీ కెమెరాలను విశ్లేషించి కేసును ఛేదించారు.
దేశంలో ఎక్కువగా సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్కు మొదటి స్థానం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 16వ స్థానంలో ఉన్నాం. నగర పోలీస్ కమిషనరేట్లో 360 డిగ్రీల సీసీ కెమెరాలు, టెక్నాలజీని వాడుతుండటంతో ఒక పక్క నేరాలు తగ్గించడం, మరో పక్క నేరం చేసిన వారికి శిక్షలు ఖరారు చేయించడంలో సక్సెస్ సాధిస్తున్నాం. ఈ ఏడాది చివరి నాటికి నగరంలో 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. సంచలనాత్మక కేసుల ఛేదనలో నేడు పోలీసులకు సీసీ కెమెరాలు తోడ్పాటునందిస్తున్నాయి. టెక్నాలజీతో కేసులను వేగంగా ఛేదిస్తునాం. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. పోలీసుల లక్ష్య సాధనలో అందరూ తోడ్పాటునందిస్తే, సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం త్వరగా పూర్తవుతుంది. – అంజనీకుమార్, నగర సీపీ