బంజారాహిల్స్,మే 18: నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403/పీ లోకి వచ్చే టీఎస్ నెంబర్ 1/పి, బ్లాక్-హెచ్, వార్డు-10లో 5 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు బోగస్ పత్రాలను తయారు చేసిన పరుశరామ్ పార్థసారథి, అతడి కొడుకు విజయ్భార్గవ్ తదితరులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్థసారథి మీద గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు క్రిమినల్ కేసులు నమోదు కాగా జైలుకు వెళ్లి వచ్చాడు.కాగా ఫిబ్రవరిలో సైతం అతడి అనుచరులు సంబంధిత స్థలం లోపలికి ప్రవేశించి గది నిర్మించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు స్థలం తమదేనంటూ దౌర్జన్యానికి దిగడంతో మరో కేసు నమోదయిన సంగతి తెలిసిందే.
హెచ్చరిక బోర్డుల తొలగింపు..
కాగా ఇటీవల మరోసారి పార్థసారథితో పాటు అతడి అనుచరులు 5ఎకరాల స్థలం బయట ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించడం, లోపలివైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు వ్యక్తులు నిఘా పెట్టిన వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలపై షేక్పేట్ మండల తహసీల్దార్ అనితారెడ్డి స్పందించారు. ఈనెల 16న రెవెన్యూ సిబ్బంది స్థలం వద్దు చేరుకుని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను తొలగించారు. రెవెన్యూ సిబ్బంది వెళ్లిపోగానే అదేరోజు రాత్రి మరోసారి బోర్డును తుడిచివేశారు. దీంతో శనివారం మరోసారి అక్కడకు చేరుకున్న రెవెన్యూ సిబ్బంది బోర్డులను రాయించడంతో పాటు గేటును సీజ్ చేసి తాళాలు వేశారు.
బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు..
కాగా ఎన్నిసార్లు హెచ్చరించినా పార్థసారథి, విజయ్తో పాటు వారి అనుచరులు పద్ధతి మార్చుకోకపోవడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. సుమారు రూ.300కోట్ల విలువైన స్థలాన్ని తమ స్థలంగా చూపిస్తూ జనాన్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారని షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు పార్థసారథి, విజయ్తో పాటు స్థలంలోకి ప్రవేశిస్తున్న అనుచరులపై బీఎన్ఎస్ 329(3), 111(4), 221,352, 322, 324(2), 62 రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రభుత్వస్థలాన్నికాజేసేందుకు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్న నిందితులపై ఆర్గనైజ్డ్ క్రైంగా బీఎన్ఎస్ 111(4) సెక్షన్ నమోదు చేయడం విశేషం.