మేడ్చల్, మే 5 (నమస్తే తెలంగాణ) : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కేటీఆర్ సమావేశాలు, రోడ్షోలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. దీంతో మల్కాజిగిరి లోక్ సభలో గూలాబీ జెండా ఎగురుతుందన్న ధీమాతో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తరఫున విస్తృత ప్రచారం చేసి ప్రజల మద్దతును కూడగడుతున్నారు. ప్రజల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థికి విశేష స్పందన లభిస్తున్న క్రమంలో మరింత ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రమంతటా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావు చేస్తున్న ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. దీనికితోడు మల్కాజిగిరి లోక్ సభ బరిలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇరువురు స్థానికేతరులు కాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు కావడంతో అనుకూలంగా మారిందని ప్రజల నుంచి అభిప్రాయపడుతున్నారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలు సైతం కాంగ్రెస్పై ఆగ్రహంతో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ గొంతుక వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునివ్వగా.. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. అంతేకాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ వస్తుండటంతో ప్రజలు సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తున్నది.