Seat Belt | సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): అనుకోకుండా వచ్చేది ప్రమాదం.. ఎప్పుడు వస్తుందో తెలియదు.. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంటుంది. రెప్పపాటులో జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి. డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వంటి ప్రధాన కారణాలతో రెండు తెలుగు రాష్ర్టాల్లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(37) సైతం సీట్ బెల్ట్ పెట్టుకోలేదు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023లో విడుదల చేసిన లెక్కల ప్రకారం 2022లో 461312 రోడ్డు ప్రమాదాలు జరుగగా అందులో 168491 మంది మృతి చెందారు. మిగతా వారు గాయపడ్డారు. అయితే చనిపోయిన వారిలో 16715 మంది సీట్ బెల్ట్ ధరించలేదని తేలింది.
గత ఏడాది ఏపీలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ వెస్ట్గోదావరి జిల్లా ఉండి మండలంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తేలింది.
2022లో టాటా సంస్థ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్, ముంబై హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఖరీదైన కారులో వెళ్లినా.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
2014లో నందమూరి జానకీరామ్, 2018లో ఆయన తండ్రి టీడీపీ నాయకులు హరికృష్ణ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఆ సమయంలో వారు సీటు బెల్టు ధరించలేదు.
నాయకుడు ఇంద్రారెడ్డి, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొడుకు ప్రతీక్రెడ్డి, ఎర్రం నాయుడు, లాల్జాన్ పాషా, శోభనాగిరెడ్డి రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడంతోనే వీరు చనిపోయారు.