మారేడ్పల్లి/బొల్లారం, ఫిబ్రవరి 1 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్లో రూ.36.28 లక్షల వ్యయంతో ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించామన్నారు. రాష్ట్రంలో 26,065 పాఠశాలలు ఉండగా, మొదటి విడుతలో భాగంగా 9,123 పాఠశాల లను మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రూ.7,289 కోట్ల నిధులతో ప్రభుత్వం మంజూరు చేసి పాఠశాలలను అభివృద్ధి చేసిందన్నారు.
హైదరాబాద్ జిల్లాలో 239 పాఠశాలలను ఎంపిక చేసి రూ. 44 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం, టాయిలెట్స్ నిర్మాణం, విద్యుత్ , తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్ కొనుగోలుతో పాటు 12 రకాల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ….గురుకుల పాఠశాలలో కూడా నాణ్యమైన ఆహారంతో పాటు విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓ బాలు నాయక్, తిరుమలగిరి డిప్యూటీ ఐఓఎస్ విజయ్ కుమార్, మారేడ్పల్లి డిప్యూటీ ఐఓఎస్ ప్రసన్నకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నా, హైస్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఛాముండేశ్వరి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, పాండుయాదవ్, జి. ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్. శ్రీనివాస్, నివేదిత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బొల్లారంలోని సదర్ బజార్లో..
బొల్లారం సదర్ బజార్లోని జీపీఎస్ ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ అధికారులు,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలతతో కలిసి ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ..కంటోన్మెంట్ బొల్లారం సదర్ బజార్లోని జీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను ఆధునిక హంగులతో రూపొందించించి ప్రారంభించింనందుకు సంతోషంగా ఉందన్నారు.ఉపాధ్యాయలు విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యను అందించి భావిపౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి రజిత,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత,వీరలక్ష్మి,బాలాదిత్య,బి.ప్రభాకర్,సునీల్ కుమార్,మంజులత,ఉపాధ్యాయ సిబ్బంది, బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్,బీఆఎర్ఎస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి,మురళీ యాదవ్,ఈఆర్ బాల్రాజు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో మా పాఠశాల ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. 25 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల కంటే దీటుగా రూపొందించి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తుంది.దానిలో మేము కూడా భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ఉంది.
-శ్రీలత, జీపీఎస్ సదర్ బజార్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు
ఇప్పుడు మా పాఠశాల చాలా బాగుంది
మా పాఠశాలను ఇంత మంచిగా తీర్చిదిద్దారు.చాలా బాగా అనిపిస్తుంది.మాకు కావాల్సిన బెంచీలు ఫర్నిచర్, లైటింగ్, ఫ్యాన్లు,టాయిలెట్లు అంతా చాలా బాగుంది.మా పాఠశాలకు వస్తే ప్రైవేటు పాఠశాల మాదిరిగా అనిపిస్తుంది. క్రమం తప్పకుండా ప్రతి రోజూ పాఠశాలకు వస్తాను.10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలోనే చదువుకుంటాను.
-మాధురి,5వ తరగతి
మారిన సర్కార్ బడుల రూపురేఖలు
మా పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించాను.ప్రభుత్వ పాఠశాలను ఇంత మంచిగా రూపుదిద్దడం బాగుంది.గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలకు ఆధునిక హంగులతో నిర్మించలేదు.మా పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నందుకు గర్వంగా ఉంది.ఈ రోజు పనికి వెళ్లకుండా పాఠశాల ప్రారంభానికి వచ్చాను. ఆనందంగా ఉంది.
-జయమ్మ,బొల్లారం,విద్యార్థి తల్లి