Niveditha | కంటోన్మెంట్, ఏప్రిల్ 29: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హమీలు నెరవేరుస్తామని చెప్పి.. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మండిపడ్డారు. కంటోన్మెంట్ రెండో వార్డు పరిధిలోని పలు బస్తీల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వ్యతిరేకత మొదలైందని, ఆ పార్టీ నాయకుల మాటలు ప్రజలు నమ్మట్లేదన్నారు. వారి పాలనలో ప్రజలకు కష్టాలు తప్ప, అభివృద్ధి శూన్యమన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.