సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గత వారం రోజుల కిందట కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్నికల తేదీని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అరవై రోజుల పాటు కొనసాగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటరు నమోదు మొదలు నామినేషన్ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు, పోలింగ్.. ఇలా ఏయే తేదీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుందనే వివరాలతో షెడ్యూల్ ఖరారు చేశారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో శుక్రవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కంటోన్మెంట్ బోర్డు ప్రత్యేక సమావేశంలో భాగంగా తొలుత దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపాన్ని ప్రకటించారు. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, సీఈవో మధుకర్ నాయక్ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం అధికారులు రూపొందించిన షెడ్యూల్ ప్రకారం మార్చి ఒకటో తేదీన కొత్త ఓటర్ల నమోదు కోసం పత్రికా ప్రకటన విడుదల కానుంది. అప్పటి నుంచి నాలుగో తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. అనంతరం బోర్డు అధ్యక్షుడి ఆదేశాల మేరకు మార్చి 23న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఆతర్వాత మార్చి 28, 29 తేదీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. 29న సాయంత్రం నామినేషన్లను దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను వెలువరిస్తారు. ఏప్రిల్ ఒకటి నుంచి 3వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. ఏప్రిల్ 6న నామినేషన్ల ఉపసంహరణ అవకాశం ఇస్తారు. ఏప్రిల్ 10వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించిన 70 గుర్తులలో నుంచి అభ్యర్థులకు కేటాయిస్తారు. అనంతరం 20 రోజుల పాటు అభ్యర్థులకు ప్రచారం చేసుకునే అవకాశాన్ని ఇస్తారు. ప్రచార ఘట్టం ముగిసిన తర్వాత ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ జరగనుందని సీఈవో వెల్లడించారు.
11 గుర్తింపు కార్డులతో ఓటింగ్కు అవకాశం..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని సీఈవో మధుకర్ నాయక్ వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి బోర్డు అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని సీఈవో కోరారు. బోర్డు ఓటరు జాబితాలో ఫొటో గుర్తింపు ఉండదని, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి 11 వివిధ గుర్తింపు కార్డులను చూపించి జాబితాలో పేర్లు ఉన్న ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని వివరించారు.