కంటోన్మెంట్, ఆగస్టు 13: కంటోన్మెంట్ బోర్డుకు సర్వీస్ చార్జీల బకాయిలు చెల్లించడంలో రక్షణ శాఖ మీనమేషాలు లెక్కిస్తుందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. ఇప్పటికే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న బోర్డుకు రక్షణ శాఖ నుంచి రావాల్సిన సుమారు రూ. 600 కోట్ల పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ నెల చివరాఖరున కంటోన్మెంట్ ప్రాంతాన్ని సందర్శించేందుకు పార్లమెంటరీ డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ రానున్న నేపథ్యంలో శుక్రవారం బోర్డు కార్యాలయంలో సీఈఓ అజిత్రెడ్డి బోర్డు మాజీ ఉపాధ్యక్షులతో సమావేశమయ్యారు. డిఫెన్స్ కమిటీ సభ్యుల సందర్శన సందర్భంగా కంటోన్మెంట్కు చెందిన సమస్యలతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి డిఫెన్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై మాట్లాడారు. బోర్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో తొలగించిన ఓట్లను పునరుద్ధ్దరించాలని, భవనాలకు సంబంధించి బైలాస్ వంటి ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
జీఎస్టీలో భాగంగా ఏడాదికి బోర్డుకు రావాల్సిన రూ.5కోట్ల నుంచి రూ. 10 కోట్లను తక్షణమే విడుదల చేయాల్సింగా కోరాలని పేర్కొన్నారు. మరోవైపు బీ3, బీ4 స్థలాల్లో నివసిస్తున్న వారికే పట్టాలు ఇవ్వాలని, నివాస ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా అధికారులు చోరవ తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న బీ4, ఎ2 ల్యాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే అక్కడ పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించేందుకు సిద్ధంగా ఉందని జక్కుల పేర్కొన్నారు.
అదేవిధంగా చీటికి మాటికి ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఆర్మీ అధికారులు రోడ్ల మూసివేత అంశంపై కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తిరుమలగిరిలోని డంపింగ్ యార్డును తక్షణమే తరలించే విధంగా చొరవ తీసుకోవాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు గౌరీశంకర్ సూచించారు. కార్యక్రమంలో జాయింట్ సీఈఓ విజయ్కుమార్ బాలన్ నాయర్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జైప్రకాశ్, జంపన ప్రతాప్, బానుకా నర్మదా, సదా కేశవరెడ్డి పాల్గొన్నారు.