డ్వాక్రా సంఘాల సభ్యులకు
క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
శామీర్పేట, మార్చి 27 : క్యాన్సర్ మహమ్మారిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూబాయిబాబు, డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. క్యాన్సర్ సొసైటీ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదివారం డ్వాక్రా సంఘాల మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు శామీర్పేట పీహెచ్సీలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శిబిరంలో 30 ఏండ్లు నిండిన డ్వాక్రా సంఘాల సభ్యులకు రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్ పరీక్షలు చేశారు. ఈ శిబిరంలో శామీర్పేట, మూడుచింతలపల్లి, మండలాల నుంచి హాజరైన 215 మంది మహిళలు పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చతుర్వేది, ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి, డాక్టర్ స్వర్ణలత, మాలతి, రీతా అగర్వాల్, దంత వైద్యురాలు సౌమ్య, జగ్గంగూడ పీహెచ్సీ వైద్యాధికారి జాన్సీ, శామీర్పేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మనుపప్పన్, ఏపీఎం యాదయ్య, వైద్య సిబ్బంది, మహిళా సమాక్య, గ్రామ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.