మేడ్చల్, అక్టోబర్25(నమస్తే తెలంగాణ)/ ఘట్కేసర్ : బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్రెడ్డి, ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డి, కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేపీ వివేకానంద్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందజేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తున్నది.
జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను ఇంటింటికీ అందజేసి తమకు మద్దతు తెలుపాలని కోరుతున్నారు. దీంతో ప్రజలే మూడోసారి కేసీఆర్ సార్ రావాలే అంటూ అభ్యర్థులకు మద్దతు ఇస్తూ కారు గుర్తుకే ఓటు వేస్తామంటున్నారు. దీంతో ఇంటింటి ప్రచారంలోబీఆర్ఎస్ అభ్యర్థులు మరింత దూసుకెళ్తున్నారు.
జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారం ప్రారంభం కాకపోవడంతో ఇరు పార్టీల శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలో కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వర్గ పోరుతో ప్రచారాన్ని ప్రారంభించలేక పోతున్నారు. బీజేపీ… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మినహా మిగతా నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది. నామినేషన్లకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన వెలవడకపోవడంతో బీజేపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్లోని ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 60 మంది మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచుకున్నారు. వీరికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో లింగస్వామి, బంగారయ్య, మల్లేశ్, క్రిష్ణయాదవ్, బాలక్రిష్ణ, నరసింహ, సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు అనురాధ,రమాదేవి, నాయకులు తదిరులు పాల్గొన్నారు.