BRSV | అక్రమ కేసులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ.. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ను ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కడారి స్వామి యాదవ్, తుంగ బాలు, చాటారీ దశరథ్, నర్సింగ్, యశ్వంత్, నాగేందర్ రావు, నర్సింగ్, రాజు ,కిరణ్, రాజు యాదవ్, రవి కిరణ్, శ్రవణ్, జూపల్లి రాము, కనీష్ లను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం లేకుండా 65 సంవత్సరాలు దాటిన కేసీఆర్ను పట్టుకొని సిట్ విచారణ పేరుతో వేధించడం మూర్ఖత్వమని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులను సిట్ విచారణ పేరిట ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం నీచమైన చర్య అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్కు కేసీఆర్కు ఎలాంటి సంబంధం లేకున్నా.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అక్రమాలను దృష్టి మళ్లించడానికే సిట్ విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి పాలన 25 మాసాలు 65 మోసాలుగా సాగుతున్నదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో స్కీముల పేరిట స్కామ్ లకు పాల్పడుతూ ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి సిట్ పేరిట డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని మండిపడ్డారు. నిరుద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. అవీనీతి, కుంభకోణాలను బయటపెడుతున్నందుకు కేసులు, నోటీసులు, విచారణలు అంటూ ఇచ్చిన హామీలు ప్రకటించిన గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ కాలం వెళ్లదీస్తున్నదని మండిపడ్డారు.