ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 21: ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పడాల సతీశ్, తొనుపునూరి శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శులు జంగయ్య, చటారి దశరథ్, రాష్ట్ర నాయకుడు శ్రీనునాయక్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అని గుర్తు చేశారు. రాజకీయాలనే అపహాస్యం చేసేలా పట్టపగలు డబ్బు సంచులతో దొరికిన ఓటుకు నోటు దొంగ రేవంత్ ఏ ముఖం పెట్టుకుని ఓయూకు వస్తాడని ప్రశ్నించారు. యూనివర్సిటీ విద్యార్థులను అత్యంత హీనంగా అవమానించిన రేవంత్రెడ్డి ఓయూలో కాలుపెడితే తరిమికొడతామని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న ఓయూ వాతావరణాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చిచ్చులు రేపి, మతకలహాలు సృష్టించి గొడవలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులను ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్పారు. ఇప్పటికే సిట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించిన చరిత్ర, పదవీ కాంక్షతో ఎంతటి నీచానికైనా దిగజారే రాజకీయ మనస్తత్వం ఉన్న రేవంత్ ఓయూలో అడుగుపెడితే విద్యార్థి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయని అన్నారు. ప్రిపరేషన్ ఆపకుండా అడుగు దూరంలో ఉన్న లక్ష్యాన్ని విపక్షాల ఉచ్చులో పడి అలక్ష్యం చేయకూడదని నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు.