సికింద్రాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయం ఖాయమని సికింద్రాబాద్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ (Padma rao Goud) , బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధీమాను వ్యక్తం చేశారు. శుకవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని జీహెచ్ఎంసీ జోనల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థి పద్మారావు గౌడ్ సాధా సీదాగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నగర ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్ల లో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఎంపీ గా గెలిచిన తర్వాత పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై పోరాడుతానని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో తాగు నీటి సమస్య , కరెంట్ సమస్యలు రాకుండా పకడ్బందీగా పనిచేశామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అడుగడుగునా నీటి కష్టాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు(BRS MLAs) తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav) , ముఠా గోపాల్ , మాగంటి గోపీనాథ్ , కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.