అంబర్పేట/ కాచిగూడ, డిసెంబర్ 3: అంబర్పేట నియోజకవర్గంలో రెండోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నా అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం సాధించారు. ఆదివారం నారాయణగూడలోని రెడ్డి కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో నియోజకవర్గంలో మొ త్తం ఓట్లు 2, 77,103 ఓట్లు ఉండగా అందులో 1.45, 479 ఓట్లు పోలయ్యాయి. అంటే 52.50 శాతం పోలింగ్ నమోదైంది.
ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్కు 74,416 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సి.కృష్ణాయాదవ్ కి 49,879 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సి.రోహిన్కుమార్రెడ్డి 18,004 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. నోటాకు 131 7 ఓట్లు పోలయ్యాయి. 16 మంది స్వతంత్రులకు 2,480 ఓట్లు వచ్చాయి. చివరి రౌండ్ వరకు కాలేరు మొత్తం 24,537 ఓట్ల మెజార్టీ సాధించారు.
అంబర్పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. విజయం సాధించిన కాలేరు ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆర్వో అపర్ణ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొని బయటకు వచ్చిన వెంటనే నాయకులు, కార్యకర్తలంతా కాలేరుకు జిందాబాద్ కొట్టారు. కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్గౌడ్, బి.పద్మావెంకటరెడ్డి, దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు.
అదేవిధంగా కాచిగూడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాలేరు రెండవసారి గెలుపొందిన సందర్భంగా గోల్నాక డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు భరత్రాజ్ముదిరాజ్ ఆధ్వర్యంలో విజహోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కిట్టు, డాక్టర్ శిరీషాయాదవ్, కె.సదానంద్, ఓం ప్రకాశ్యాదవ్, మున్నాసింగ్, సునీల్బిడ్లాన్, తుమ్మల నర్సింహారెడ్డి, నాగేందర్బాబ్జి, శేషు, మహేశ్కుమార్, ప్రతిభ, బబ్లూసింగ్, అంటోని, అశోక్, రాజేశ్, డొర్నాల భరత్ముదిరాజ్, కాలేరు రామకృష్ఱ, కాలేరు రాజు, కిశోర్, శ్రీకాంత్యాదవ్తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.