KTR | మోదీని చౌకీదార్ చోర్ అని రాహుల్ బాబా అంటున్నాడని.. కానీ మోదీ చౌకీదార్ కాదు బడేభాయ్ అని రేవంత్ బాబా అంటున్నాడని కేటీఆర్ విమర్శించారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే.. అదానీ ఫ్రెండ్ అని రేవంత్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. గుజరాత్ మోడల్ గోల్మాల్ అని రేవంత్ అంటే.. గుజరాత్ మోడల్ అద్భుతమైన మోడల్ అని రేవంత్ అంటున్నారు. తెలంగాణను కూడా గుజరాత్లా మారుస్తామని అంటున్నాడని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ అంత బోగస్ అని.. కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని తప్పు అని రాహుల్ గాంధీ అంటుంటే.. లిక్కర్ స్కామ్ జరిగిందని.. కవితను అరెస్టు చేయడం సరైనదే అని రేవంత్ రెడ్డి అంటున్నాడన్నారు. యూసుఫ్గూడలో ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రాహుల్తో కలిసి పనిచేస్తున్నాడా? మోదీతో కలిసి పనిచేస్తున్నాడా? అని ప్రశ్నించారు. పొరపాటున మీరు కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లే అని తెలిపారు. అందుకే సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
2014 నుంచి మాగంటి గోపీనాథ్ మెజార్టీ పెరుగుతూనే ఉందని కేటీఆర్ అన్నారు. ఆయన కల్యాణలక్ష్మీతో పాటు చీర, గిఫ్ట్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. మరి కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తులం బంగారం వచ్చిందా? అని బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి అడగాలని పిలుపునిచ్చారు. వంద రోజుల్లోనే ప్రతి గ్యారంటీ నెరవేరుతుందని బిల్డప్లు ఇచ్చారని.. 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. కోడలు పిల్ల ఉంటే.. 2500, ఇంట్లో ముసలివాళ్లు ఉంటే.. 4000 ఇస్తామని నమ్మబలికారు. మరి నాలుగు వేలు వస్తున్నాయా? కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే వస్తున్నాయా? అని అడగాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలందరూ కోపంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. గ్రామాల్లో , పట్టణాల్లో, రైతులు, ఆటో డ్రైవర్లు, మహిళలు, యువకులు అంతా కోపంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి మాట ముచ్చట చెప్పి.. కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్ల ఉండే.. ఇవాళ పరిస్థితి ఎట్లుందని అడగాలని పిలుపునిచ్చారు. కరెంటు, మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం మనకెందుకు అని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటు చేసినం అని కేటీఆర్ గుర్తు చేశారు. అంబేడ్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర రేవంత్ రెడ్డి నివాళులర్పించలేదని విమర్శించారు. విగ్రహానికి దండ వేయకుండా.. తాళం పెట్టి ఎవర్నీ రానివ్వకుండా చేసిన ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్ కాబట్టే.. ఎవరినీ రానివ్వలేదని తెలిపారు. మరి కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్లో సిగ్గులేకుండా ఎందుకు కూర్చుంటున్నావని మండిపడ్డారు. సెక్రటేరియట్కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టినం అని అన్నారు.
పేగులు మెడలో వేసుకుంటానని రేవంత్ రెడ్డి అంటున్నారని.. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాడని అంటున్నారని అన్నారు. ‘ సూర్యాపేట నుంచి నిన్ననే నాకు ఓ మిత్రుడు కాల్ చేశాడు. బస్సులో ఒక జేబు దొంగను పట్టుకున్నారట. పోలీసులు తీసుకెళ్లి వాణ్ని స్టేషన్లో పెట్టిండ్రు. వాన్ని ఒక్కటి కొట్టి ఏమేం దోసుకున్నవో బయటపెట్టు అని అన్నారు. మరి నీ జేబులో కత్తెర ఎందుకు పెట్టుకున్నావ్ అని పోలీసులు అడిగారు. అందుకు ఆ దొంగ.. ముఖ్యమంత్రే జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుండు.. నేనెందుకు పెట్టుకుని తిరగద్దు అని అడిగిండట. జేబులో కత్తెర పెట్టుకోవడమే నేరమా? అని ప్రశ్నించాడట.’ అని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఇలాగే మాట్లాడుతారా? అని మండిపడ్డారు. మెడలో పేగులు వేసుకుని ఎవరు తిరుగుతరు.. నువ్వేమైనా బోటి కొట్టేటోడివా? అని ప్రశ్నించారు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అని మండిపడ్డారు.
లంకె బిందెల కోసం వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. లంకెబిందెల కోసం తిరిగేది లంగలు, దొంగలు అని మండిపడ్డారు. అర చేతిలో వైకుంఠం చూపించి.. తంతే గారెల బుట్టెలో పడ్డట్టు ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు. అప్పట్నుంచి ఏం చేయాలో ఆయనకు అర్థం కావడంలేదు. నెలకు 2500 ఎట్ల ఇవ్వాలో తెలియదు.. 4వేలు ఎట్ల ఇవ్వాలో తెలియదు. నోటికి ఎటుపడితే అటు ఒర్రిండు.. ఇప్పుడు ఇరుక్కున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు.. ఇప్పుడు ఎట్ల చేయాల్నో తెలియదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అని.. ఈ స్కామ్.. ఆస్కామ్ అని కొత్త కథ మొదలుపెట్టిండు అని డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ఏమున్నా పిచ్చి మాటలు మాట్లాడుతూ దిమాక్ ఖరాబ్ చేస్తున్నారని అన్నారు.
హైదరాబాద్ బాగుండాలంటే. హిందువులైనా.. ముస్లింలైనా.. సిక్కులైనా.. క్రిస్టియన్లైనా కలిసి మెలిసి ఉండే వాతావరణం ఉండాలి. ఇవాళ బీజేపోళ్లు మతం పేరిట రెచ్చగొట్టి ఆడే డ్రామాలను కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన హిందువులు ఎవరూ కూడా ముస్లిం, క్రైస్తవ సోదరులు అవమానించరని తెలిపారు. నా ధర్మాన్ని నేను పాటిస్తా.. ఇతరులను కూడా గౌరవిస్తా అనేటోడు నిజమైన హిందువు అని స్పష్టం చేశారు. ఇతర మతస్థులందర్నీ అవమానిస్తా అని చిల్లర రాజకీయాలు చేసే బీజేపోళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.