రాష్ట్రంలో బీజేపీ తీస్మార్ ఖాన్లు అని చెప్పుకునే బండి సంజయ్,ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్రావు, సోయం బాబూరావు వంటి వాళ్లను గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే.. అలాంటి బీఆర్ఎస్ను బీజేపీ బీటీమ్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
బంజారాహిల్స్: అరచేతిలో స్వర్గాన్ని చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కోపంతో ఉన్న ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ..మతాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు నడిపిస్తున్న బీజేపీని అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని, కాంగ్రెస్ పార్టీకి దేశంలో 40 సీట్లు కూడా రావని ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ చెప్పడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.
‘రాముడికి మొక్కుదాం..బీజేపీని తొక్కుదాం’ అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలను ఓట్లు అడగాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ తీస్మార్ ఖాన్లు అని చెప్పుకునే బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్రావు, సోయం బాబూరావు వంటి వాళ్లను గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులేనని..అలాంటి బీఆర్ఎస్ను బీజేపీ బీటీమ్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే నవ్వాలో ఏడవాలో తెలియడంలేదన్నారు. హామీల అమలు గురించి అడిగితే ఫోన్ ట్యాపింగ్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్కు మద్దతు పలకడం ఖాయమన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ఫ్రభుత్వానిదయితే ఆయన జయంతి రోజున 125 అడుగుల విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనీసం దండ వేయకపోవడం ఆ మహనీయుడికి అవమానమేనని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి దండ వేయడానికి రేవంత్ రెడ్డికి అహం అడ్డువచ్చిందని, సిగ్గులేకుండా కేసీఆర్ కట్టించిన సెక్రటేరియేట్లో మాత్రం ఎలా కూర్చుంటారని ఎద్దేవా చేశారు.
2001 నుంచి ఉద్యమసారథి కేసీఆర్ వెంట ఉన్న పద్మారావు గౌడ్ ఎన్నికష్టాలు వచ్చినా వెనక్కి తగ్గలేదని, అలాంటి నికార్సయిన నేతను పార్లమెంట్కు పంపాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొట్టమొదటి సీటు సికింద్రాబాదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి, మైనార్టీ రాష్ట్రనేత సోహైల్తోపాటు కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్, మన్నె కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.