KTR | సిటీబ్యూరో, మే 2, (నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్, కేపీహెచ్బీకాలనీ : కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన కరెంట్, తాగునీటి కష్టాలు పోవాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి 10-12 సీట్లు అప్పజెప్పితే.. సంవత్సరంలో కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు బాధపడుతున్నారని, ఆ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో మోసపోయామని గుర్తించారన్నారు. అందుకే కేసీఆర్ చేపడుతున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
గురువారం సికింద్రాబాద్, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పద్మారావు గౌడ్, రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్నగర్ చౌరస్తాలో, కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేటలో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించి ప్రసంగించారు. 2014లో ఖాతాలు తెరవండి..రూ.15 లక్షలు వేస్తా, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా..రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ ఏం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. మోదీ తరహాలోనే రేవంత్రెడ్డి రూ.4వేల పింఛన్, మహిళలకు నెలకు రూ.2500, రైతుబంధు, రుణమాఫీ అని..నాలుగున్నర నెలలు గడిచినా.. ఇందులో ఒక్కటి కూడా అమలు చేయలేదని, బడే బాయ్ మోదీ..చోటే బాయ్ రేవంత్రెడ్డి ఇద్దరు ఇద్దరే.. అని కేటీఆర్ విమర్శించారు.
జూన్ 2 తర్వాత హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్ర చేస్తున్నారని, అడ్డుకోవాలంటే గులాబీ కండువా, కేసీఆర్ గళం పార్లమెంట్లో వినబడాలని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ను కేసీఆర్ అన్ని విధాలా బాగు చేస్తే, ఈ నగరాన్ని సర్వనాశనం చేయాలని రేవంత్రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త పరిశ్రమలు రాకపోగా..ఉన్నవి తమిళనాడు, గుజరాత్కు తరలిపోయాయని, ఉన్నవి కాపాడుకోలేని అసమర్థ సీఎం రేవంత్రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. ఒక్క ఓటుతో అటు బడే బాయ్.. ఇటు చోటే బాయ్కి గుణపాఠం చెప్పాలన్నారు.
గులాబీ కండువాతో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కనీసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా కాంగ్రెస్లోకి వెళ్లి ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. ఎన్నికలు అయ్యాక సీఎం రేవంత్రెడ్డి, దానం నాగేందర్ బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ అన్నారు. ఇక సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి.. హైదరాబాద్కు నయా పైసా పనిచేయలేదని విమర్శించారు. ‘అక్కరకు రానీ బీజేపీ, పనిచేయని కిషన్రెడ్డి మనకొద్దు’ అని కేటీఆర్ చెప్పారు.
పదేండ్ల బీఆర్ఎస్ అభివృద్ధి పాలన చూసిన ప్రజలు..హైదరాబాద్ మహానగరం మరింత అభివృద్ధి కావాలని కోరుకున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారని, జీహెచ్ఎంసీ పరిధిలో 24 సీట్లలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్కు 16 సీట్లను గెలిపించారని, ఈ విషయంలో హైదరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని కేటీఆర్ అన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్లో అభివృద్ధిపై గళం విప్పుతారని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజా స్పందన చూస్తుంటే.. సికింద్రాబాద్లో గులాబీ విజయం ఖాయమైందని, మెజార్టీ మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ రోడ్షోలలో ఎమ్మెల్సీలు నవీన్కుమార్, శంభీపూర్ రాజు, హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విష్ణువర్థన్రెడ్డి, కార్పొరేటర్లు ముద్దం నర్సింహా యాదవ్, సబిహా, జూపల్లి సత్యనారాయణ, ఆవుల రవీందర్ రెడ్డి, మందాడి శ్రీనివాస్, పండాల సతీశ్గౌడ్, రాజ్కుమార్ పటేల్, దేదీప్య పాల్గొన్నారు.