KTR | కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వంద రోజులు ఓపిక పడతామని.. మార్చి 17 వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొందపెడతామని స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించిన మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు.
జిల్లాల్లో ఉండే ప్రజలను 420 హామీలతో మోసం చేసి కాంగ్రెస్ నేతలు గద్దెనెక్కారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులయ్యిందని.. అప్పుడే కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయని విమర్శించారు. రైతులకు రైతు బంధు పడలేదని.. ఫ్రీ బస్ వల్ల అడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని.. ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు ఆగమైనరని అన్నారు. నోటికొచ్చిన మాటలు అమలుకాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇంకా చేయలేదని మండిపడ్డారు. కోటి 57 లక్షల మహిళలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందని చూస్తున్నారని.. తాము కూడా 100 రోజులు ఓపిక పడతామని డెడ్లైన్ చెప్పారు. మార్చి 17 వరకు హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొందపెడుతామని స్పష్టం చేశారు. తిట్ల పురాణం బంద్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి పిలుపునిచ్చారు.100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేరని.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడుతారని తెలిపారు.
కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మేం నెరవేర్చుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ఆ మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ సీటు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో గులాబీ జెండా ఉంటేనే మన ఎంపీలు గెలిస్తేనే మన రాష్ట్ర సమస్యలు మాట్లాడుతారని స్పష్టం చేశారు. మన అధినేత కేసీఆర్ ఎంపీగా ఎవరికి అవకాశం ఇచ్చిన భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలను కాపాడుకుంటామని.. వారికి పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.