KTR | హైదరాబాద్ : మూసీ నదిపై బ్రిడ్జిల నిర్మాణంలో కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎండగట్టారు. మూసీ నదిపై వంతెనల నిర్మాణం హైదరాబాద్ వాసుల చిరకాల కల. ఆ కలను నిజం చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 545 కోట్లు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
మూసీ నదిపై వంతెనల నిర్మాణం ద్వారా హైదరాబాద్ వాసుల రాకపోకలను సులభతరం చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం జనవరి 2022లో రూ. 545 కోట్లతో 15 వంతెనల నిర్మాణానికి మంజూరు చేసింది. ఈ వంతెనల పొడవు సుమారు 150-200 మీటర్లు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. మూసీ నదిపై ఒక్క వంతెన కూడా ఇంకా పూర్తి కాలేదు. నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం.. ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా మారాయి. ఇది పనికిమాలిన ప్రభుత్వం, పనికిమాలిన పాలన అని కేటీఆర్ విమర్శించారు.