BRS | సిటీబ్యూరో:ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నేతలు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఫీజు ప్రజలపై భారం పడుతుందని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలంటూ బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, హెచ్ఎండీఏ కార్యాలయంతో పాటు జోనల్, శివారు మున్సిపల్ కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బూటకపు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చాక ప్రజలపై భారం మోపే నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు. ప్రస్తుత మంత్రులు గతంలో ఎల్ఆర్ఎస్పై అనేక రకాల ప్రకటనలు చేశారని, ఫీజు అవసరం లేకుండానే రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటనలు చేశారని, దానిని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.