మేడ్చల్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): అత్యంత కీలకమైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన ధీమాతో వ్యూహాలు రచిస్తున్నది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన అన్ని హామీలు అమలుకు నోచుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
అయితే ఇదే అవకాశాన్ని అదనుగా భావిస్తున్న బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న సన్నహక సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టి ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డిలు తమ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడి చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి ఎన్నికై నియోజకవర్గానికి ఎలాంటి మంచి చేయలేదని విమర్శిస్తూ తమ ప్రచారానికి పదును పెంచుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో నగరవాసులంతా బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపడం అదే ట్రెండ్ ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా కొనసాగనుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే నగరంలోఅన్ని విధాలా అభివృద్ధి జరిగిందని.. ఇదే అంశం పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి అనుకూలంగా మారనుందని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల కంటే అసెంబ్లీ ఎన్నికల్లో మూడున్నర లక్షల పైచిలుకు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విషయం తెలిసిందే
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఉపందుకున్నది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్లలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాక మల్కాజిగిరి పార్లమెంట్ పరిధికి సంబంధం లేని అభ్యర్థి అయిన సునీతామహేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించడంతో ఆ పార్టీకి మరింత సంకటంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(బుధవారం) మేడిపల్లిలో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్రావు, చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కానున్నారు.