సంపూర్ణ రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రైతులతో కలిసి పోరుబాట పట్టింది. కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి.. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ.. గురువారం గ్రేటర్వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. ‘కొర్రీలు వద్దు.. కోతలొద్దు’.. రైతులందరికీ రుణ మాఫీ చేయాల్సిందేనంటూ.. గర్జించింది. గులాబీ దళం చేపట్టిన నిరసనల్లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ‘ఇదేం ప్రభుత్వం.. ఇదేం మోసమం’టూ.. నినదించారు. ప్రతి ఒక్క రైతుకూ రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని చేవెళ్లలో జరిగిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు.
-మేడ్చల్/చేవెళ్ల/బడంగ్పేట
BRS | రైతులందరి పంట రుణాలను మాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు పట్లోళ్ల కార్తిక్రెడ్డి, పట్నం అవినాశ్రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. అంతకుముందు షాబాద్ చౌరస్తా నుంచి ధర్నా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ‘రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి… రుణమాఫీ అని మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం నశించాలి’…సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మొదటి సంతకం రూ. 2 లక్షల పంట రుణాల మాఫీపైనే పెడుతానని చెప్పారని, ఎవరైనా లోన్ తీసుకోని వారుంటే త్వరగా బ్యాంకులకెళ్లి రుణాలు తెచ్చుకోవాలని చెప్పారన్నారు.
చేవెళ్ల గడ్డపై నుంచి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల రైతులతో పాటు తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని.. రూ.2 లక్షల వరకు రుణాలను ప్రభుత్వమే మాఫీ చేయడంతో పాటు వడ్డీ కూడా చెల్లించాలని ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఓట్లు వేసింది అధికారులకు కాదని… కాంగ్రెస్ పార్టీ నేతలకని.. అందుకే రైతులంతా కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి నిలదీయాలన్నారు. అర్హులకు ఎందుకు రుణమాఫీ కాలేదో గ్రామాల్లోని నాయకులను ప్రశ్నించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారారో అడగాలన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమిస్తామన్నారు.
కాంగ్రెస్వి 420 హామీలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజల ముందు పెడతామని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రైతులంతా ఒక్కసారి ఆలోచించాలంటూ..కేసీఆర్ హయాంలో ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉన్నదో బేరీజు వేసుకోవాలన్నారు. కరెంట్ కోతలు, తాగు, సాగు నీరు లేకపోవడంతో ఇక్కడి పరిశ్రమలు, పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటే.. భూములకు ధరలు వస్తాయా..? అని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టులను రేవంత్రెడ్డి రద్దు చేస్తున్నారని ఫార్మాసిటీ, ఎయిర్పోర్టు వరకు వెళ్లే మెట్రోను రద్దు చేస్తే..రంగారెడ్డి జిల్లా అభివృద్ధి ఎట్లయితదో ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని…భారత రైతు సమితిగా రైతుల పక్షాన పోరాడుతుందన్నారు.
షాబాద్ కళ తప్పింది..
శంషాబాద్ మండలంలోని నర్కుడలో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా, ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడ షాబాద్కు చెందిన ఓ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. అన్న బాగున్నారా..అని పలకరించాడు. నేను కూడా బాగున్నా.. తమ్మి మీరెలా ఉన్నారని అడిగితే… అతడు ఒకే ఒక మాట అన్నాడు.. కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత మా షాబాద్కు కళనే పోయిందన్నాడు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు షాబాద్, చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాలను ప్రపంచానికి తెలిసేలా చేశారని చెప్పాడు. శంకర్పల్లిలో రైలు డబ్బాలు తయారవుతున్నాయి.. చందనవెల్లిలో తయారైన కార్పెట్లు సిల్కాన్కు వెళ్తున్నాయంటే అది కేసీఆర్ పుణ్యమేనని రవీందర్రెడ్డి అనే తమ్ముడు నాతో చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అరిగోస పడుతున్నది..రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆగమాగమవుతున్నారు.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం చెప్పాలి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి చేవెళ్లకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నారు. రైతులను నట్టేట ముంచి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా ప్రతి రైతూ గొంతెత్తి మాట్లాడే సమయం వచ్చింది. రుణమాఫీ చేసినం అని చెబుతున్నారు. ఒక రంగారెడ్డి జిల్లాలో 2,80,000 మంది రుణాలు తీసుకుంటే.. ప్రభుత్వం మాఫీ చేసింది కేవలం 75,000 మందికే. రైతులను బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు కానీ.. ఇంతవరకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేయలేదు.
ఇంతకుముందు కేసీఆర్ రెండు పర్యాయాలు రైతులందరికీ రుణమాఫీ చేశారు. కానీ.. రేవంత్రెడ్డి సర్కార్ కొద్దిమందికే రుణమాఫీ చేసి… అందరికీ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకొంటున్నది. రుణమాఫీ వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు సీఎం సొంతూరుకు వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి దుర్మార్గమైన చర్య. అందరికీ రుణమాఫీ చేస్తే రేవంత్రెడ్డికి భయమెందుకు. నోరు విప్పితే కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. సీఎంగా ఎక్కడికెళ్తే అక్కడ ఉన్న దేవుళ్లపై ఒట్లు వేశారు. కానీ.. ఆయన ఒట్ల నుంచి చేవెళ్ల వెంకటేశ్వరస్వామి మాత్రం తప్పించుకున్నారు. గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసి రుణ మాఫీ కాని అన్నదాతల జాబితాను తయారు చేసి.. రేవంత్రెడ్డికి ఇద్దాం. ప్రతి రైతుకూ రుణమాఫీ అయ్యేవరకు బీఆర్ఎస్ పోరాడుతుంది.
– పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి
రైతు పక్షపాతి కేసీఆర్
దేశంలో రైతుల సంక్షేమానికి పాటుపడిన ఒకే ఒక్క నేత కేసీఆర్. 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించారు. తెలంగాణ రాక ముందు ఎంతోమంది రైతు లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రధాని మోదీ బోర్లకు మీటర్లు పెట్టాలని చెబితే కేసీఆర్.. ప్రాణం పోయినా.. మోటర్లకు మీటర్లు పెట్టనని తేల్చి చెప్పారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కేసీఆర్ ఉద్దేశం. రైతుల కోసం ఢిల్లీలో ధర్నాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. చనిపోయిన రైతుల కుటుంబాలకు రైతు బీమా కింద పరిహారాన్ని అందించి ఆదుకున్నారు. దేశంలోనే రైతుల సంక్షేమానికి ఆయన పెద్దపీట వేశారు. దొంగ కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు.
-మహమూద్ అలీ, మాజీ హోం మంత్రి
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి..
తెలంగాణలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి. మరో నాలుగైదు రోజులైతే బీఆర్ఎస్ను వదిలి వెళ్లిన 11 మంది రోడ్డుపైకి వచ్చి మమ్మల్ని కాపాడాలని కేసీఆర్ దగ్గరికి వచ్చే పరిస్థితి కనబడుతున్నది. వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలో ఉన్న ఉద్యమకారులతో మరింత బలోపేతం చేయాలి. రైతు రుణమాఫీ చేస్తామని కనిపించిన దేవుళ్లకు దండం పెట్టి రేవంత్రెడ్డి మోసం చేశారు. బ్యాంకుల్లో రూ. 2,20,000 రుణముంటే ముందు రైతును రూ.20 వేలు కట్టమని చెప్పి, ఆ తర్వాత రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పడం సరికాదు. ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అందరూ గమనించాలి. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని ఇంకా ఇవ్వడం లేదు.
-స్వామిగౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్
తహసీల్దార్లకు వినతి
నాదర్గూల్ భాగ్యనగర్ రైతు సేవా సహకార సంఘంలో 204 మందికి రుణమాఫీ కాలేదంటూ.. అన్నదాతలకు న్యాయం చేయాలని బాలాపూర్, మహేశ్వరం మండలాల తహసీల్దార్ కార్యాలయాల ముందు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.
పోరాటం ఆగదు
మల్లాపూర్ : ప్రతి రైతుకు రుణమాఫీ చేసేవరకు పోరాటం ఆగదని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, ప్రభుదాస్ నిరసన తెలిపారు.
3,432 మందికే రుణమాఫీ సిగ్గుచేటు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రుణమాఫీ చేయాలంటూ..రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు రైతులందరికీ రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 30 వేల పైచిలుకు అర్హులుంటే.. కేవలం 3,432 మందికే రుణమాఫీ చేయడం సిగ్గుచేటన్నారు.
మోసపూరిత హామీలు
బొల్లారం, ఆగస్టు 22: కాంగ్రెస్ సర్కారు మోసపూరిత హామీలు ఇచ్చి..రైతులను ఆగం చేసిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయిన్పల్లి చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు రైతులకు రుణమాఫీ చేయాలంటూ..నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.