కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గురువారం నగరవ్యాప్తంగా గులాబీ శ్రేణులు, మహిళలు నిరసనలతో హోరెత్తించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇందులో భాగస్వాములయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాయితీలకు చరమగీతం పాడుతూ.. మోయలేని భారాన్ని మోపుతూ..సామాన్యుల నడ్డివిరుస్తున్నదని, అన్ని వర్గాలను ఇబ్బందిపెడుతున్నదని మండిపడ్డారు. అచ్చేదిన్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు పనిచేస్తుంటే.. కేంద్రం మాత్రం ధరలు పెంచి సంక్షోభం స్పష్టిస్తున్నదని దుయ్యబట్టారు. ‘మోదీ హటావో.. దేశ్ బచావో’ అంటూ నినదించారు. ఘట్కేసర్లో మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి, లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద హోం మంత్రి మహమూద్ అలీ, సికింద్రాబాద్ ఎంజీరోడ్లో మంత్రి తలసాని, మీర్పేటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బంజారాహిల్స్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నిరసనల్లో పాల్గొన్నారు.
వంటింట్లో కేంద్రం మంట
గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం మరోసారి పేదలపై భారం వేస్తూ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం బంజారాహిల్స్ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలతో కలిసి ఆమె ఆందోళన నిర్వహించారు.
మేడ్చల్/ఘట్కేసర్, మార్చి 2 : వంటింట్లో కేంద్రం మంట పెడుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమోత్తారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో వరంగల్ జాతీయ రహదారిపై గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో మంత్రులు హరీశ్రావు, చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి చాయ్ పే చర్చ పెడుతున్నారని, చాయ్ బండి కాడ చర్చ పెట్టి రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1100 చేశామని చెప్పాలన్నారు. పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
బీజేపీ పాలన అచ్చేదిన్ కాదు, ధరలను పెరుగుదలను చూసి, సామాన్యుడు భయపడి సచ్చేదిన్గా మారందని దుయ్యబట్టారు. బీజేపీ అంటే భారత జనులను పీడించే పార్టీ అని, గల్లీ మీటింగ్కి వచ్చే బీజేపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, మాజీ ఎమ్మేల్యే సుధీర్రెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
13 సార్లు గ్యాస్ ధరలు పెంచారు
కవాడిగూడ / చాదర్ఘాట్, మార్చి 2 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 13 సార్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని హోం మంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. గురువారం లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.అలాగే మలక్పేట నియోజకవర్గలోని చాదర్ఘాట్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి ఆజం అలీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన హోంమంత్రి మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు మోదీకి తగిన గుణపాఠం చెపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి, కార్పొరేటర్లు సంగీతా యాదవ్, మన్నె కవిత, మాజీ కార్పొరేటర్లు హేమలతా యాదవ్, మమతా గుప్తా, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సంతోష్ గుప్తా, మహేందర్, గెల్లు శ్రీనివాస్, లాయక్ అలీ, శ్రీధర్రెడ్డి, కారింగల మారుతీ, అమర్, పగిళ్ల నర్సింగ్, హయత్ హుస్సేన్ హబీబ్, బాసిత్ అలీ, షౌకత్ అలీ, మహిళా నాయకురాలు రేణుక, రుక్మిణి, రాధ, భువనేశ్వరీ, లలిత తదితరులు పాల్గొన్నారు.
కమలం గుర్తుకు ఓటేస్తే కట్టెలపొయ్యి వస్తది
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తే కట్టెల పొయ్యి వస్తదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గ్యాస్ ధరలు తగ్గించాలని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లెలగూడ చందన చెరువు నుంచి మీర్పేట చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పతనం వంటింటి నుంచి మొదలయిందని, మహిళల శక్తి మోదీకి చూపించాలని అన్నారు. బస్తీలకు వస్తున్న బీజేపీ నాయకులకు గ్యాస్ సిలిండర్ చూపించాలని ఆమె పిలుపు నిచ్చారు.
మోదీ ఫొటో రేషన్షాపుల దగ్గర కాదు గ్యాస్ సిలిండర్లకు పెట్టాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, మేయర్ దుర్గా, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిలు బేర బాలకిషన్, మురుకుంట్ల అరవింద్ శర్మ, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కందుకూరు అధ్యక్షుడు జయేందర్, మహేశ్వరం బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు నాయక్, ఆర్కేపురం అధ్యక్షుడు నాగేశ్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి
ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని తక్షణమే మోడీ గద్దె దిగాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు గురువారం సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం కట్టెల పొయ్యిపై మంత్రి తలసాని వంటచేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ…గ్యాస్ ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకోవాలని మహిళలకు మంత్రి పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 745 పెరిగిందని విమర్శించారు. శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో ధర్నాలు, నిరసనలు కొససాగుతాయని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క పైసా నిధులు తేలేని బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ సాయికిరణ్యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, ఆకుల రూప, నాయకులు పవన్కుమార్గౌడ్, శ్రీనివాస్గౌడ్, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మోదీకో దండం..సిలిండర్కో దండం
గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలను నిరసిస్తూ సికింద్రాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలోజరిగిన ధర్నాలో సిలిండర్కు దండం పెడుతూ నిరసన తెలుపుతున్న మహిళలు
ప్రజల నడ్డివిరుస్తున్న కేంద్రం
గ్యాస్ ధరలను అదుపులో ఉంచాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచి సామాన్య ప్రజలు , వ్యాపారుల నడ్డి విరుస్తున్నది. రోజు వ్యాపారం చేస్తే వచ్చే ఆదాయంతో చాలీచాలక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. గ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతున్నాయి. బతకడం చాలా కష్టంగా ఉంది.
– రాజు, చాయ్ వ్యాపారి, చర్లపల్లి , ఉప్పల్
ప్రజలకు గుదిబండ
పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు తోడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి పేద, మధ్య తరగతి కుటుంబాల నెత్తిపై గుదిబండ మోపింది. గతంలో రూపాయి, రెండు రూపాయలు పెంచితేనే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆందోళనలు చేసింది. ప్రస్తుతం వందల్లో పెంచుతూ పేదల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఇకనైనా కార్పొరేట్లను ప్రసన్నం చేసుకోవడం మానేసి, పేదల గురించి ఆలోచించాలి.
– యమున, గృహిణి, గచ్చిబౌలి
ధరల పెంపుతో బతుకు భారం
గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం ఇష్టమొచ్చినట్లు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోంది. ధరలను అదుపులో పెట్టాల్సింది పోయి ఇష్టానుసారంగా పెంచుతున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ధరల మోతతో బతకు కష్టమైతున్నది. అన్నీ పిరమైతే ఏం చేయాలో అర్థమైతలేదు. కేంద్రం మాలాంటి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గించాలి.
– సంగీత, కమల్నగర్, చాదర్ఘాట్
కేంద్రం తీరు మార్చుకోవాలి
వంట గ్యాస్పై రూ.50, వాణిజ్య సిలిండర్పై రూ.350 కు పైగా పెంచడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పెరిగిన ధరలు ప్రజలకు భారం కానున్నాయి. పేదల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి వీడాలి. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి.
– భూపాల్, బోరబండ.
ప్రజలకు పెనుభారం
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధర పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారింది. రూ.400 ఉన్న సిలిండర్ ధరను బీజేపీ ప్రభుత్వం వచ్చాక రూ.1150 వరకు పెంచింది. దీంతో సామాన్య ప్రజలు గ్యాస్ బండను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా కేంద్రం వంట గ్యాస్ ధరను సబ్సిడీకింద అందుబాటులోకి తీసుకురావాలి.
– వరలక్ష్మి, గృహిణి, భూలక్ష్మినగర్
ఎట్ల బతకాలె..
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి సామన్యుడి నడ్డి విరుస్తుంది. ఏదో చిన్న వ్యాపారం చేసుకొని జీవనోపాధి పొందుదామని అనుకుంటే ఆ వ్యాపారం కూడా సరిగా నడవక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితుల్లో ఇంట్లో సిలిండర్కు రూ. 1150 వరకు చెల్లించాలంటే భారంగా మారింది. సిలిండర్ సబ్సిడీని కేంద్రం ఇవ్వండం లేదు. ఇక సామాన్యులు బతికేదెట్లా సారూ…
– మక్బూల్, భోలక్పూర్, కవాడిగూడ
ధరల పెంపు సరికాదు
గ్యాస్ బండ మోయలేని స్థాయికి ధర పెరిగింది. కార్పొరేట్ శక్తుల చేతుల్లో చిక్కిన కేంద్రం ఆ లోటును పూడ్చేందుకు పేదలపై వివిధ రూపాల్లో భారం వేస్తున్నది. గ్యాస్ ధర పెంపుతో అదనపు భారం పడుతున్నది. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలి.
– స్వప్న, గృహిణి, మియాపూర్
సామాన్యుడు బతకడం కష్టం
రోజు రోజుకు ధరలు పెంచుతుంటే సామాన్యుల పరిస్థితి కష్టంగా ఉంది. ఇలా పెంచుకుంటూ పోతే గ్యాస్ సిలిండర్ కొనలేని పరిస్థితి. రూ.400 నుంచి 1150 వరకు పెంచారు. ఇప్పుడు మళ్లీ రూ.50 పెంచారు. గ్యాస్ ధరలు పెరిగితే తినే నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలి.
– సత్తెమ్మ, గృహిణి, శ్రీరామకాలనీ, పహాడీషరీఫ్
పెంచినధరలతో పేదవాడికి శాపం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు పేదవాడికి శాపంగానే మారుతున్నాయి. గ్యాస్, నిత్యావసర వస్తువులపై ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజల నడ్డీ విరుస్తోంది. ఒకవైపు పెరిగిన గ్యాస్ ధరలతోనే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మళ్లీ పెంచడం అన్యాయం. కార్పొరేట్కు అనుకూలంగా, పేదవాడికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకి అలవాటే.
– రేణుక, గృహిణి, తుకారాంగేట్