అంబర్పేట, సెప్టెంబర్ 1 : బతుకమ్మకుంట వ్యవహారంలో తనపై జరుగుతున్న దుష్ర్పచారం వెనుక వాస్తవాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజల ముందుంచాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. తనపై అపనిందలు మోపుతున్న వారి వెనుక ఎవరున్నారో సీఎం బహిర్గతం చేయాలని కోరారు. ఈ విషయమై మంగళవారం ఎడ్ల సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. బతుకమ్మకుంట, హైడ్రా పేరుతో తన భూమిలో నుంచి అన్నింటిని తొలగించి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును, దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను ఇప్పటి వరకు అమలు చేయలేదని సుధాకర్రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా తప్పుగా భావిస్తున్నారా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
‘అబద్దాలను వందసార్లు చెప్పినంత మాత్రాన అవి నిజాలు కావు. నేను బతుకమ్మకుంటను బాగు చేశానా? లేక కబ్జా చేశానా?’ అనే విషయాన్ని కోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను పాటించకుండా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రిని ఏమనాలని ప్రశ్నించారు.
మీరు ముఖ్యమంత్రి పదవికి అర్హులా? అన్నది ముందుగా తేల్చుకోండని వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న దుష్ర్పచారం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేసిన సుధాకర్రెడ్డి.. తన హక్కుల కోసం ఎలాంటి పరిస్థితులు ఎదరైనా చట్టపరమైన మార్గంలో చివరి వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ‘నిజాన్ని దాచిపెట్టలేరు.. న్యాయం ఆగిపోలేదు.. నా పోరాటం ఆగదు..’ అని వెల్లడించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్వీ నాయకుడు జేడీ రాహుల్, బీఆర్ఎస్ ఉద్యమకారుడు చందర్ పాల్గొన్నారు.