బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలివెళ్లేందుకు గ్రేటర్ గులాబీ దండు సమాయత్తమవుతున్నది. పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న విస్తృతస్థాయి సమావేశాలు గులాబీ సేనల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తున్నాయి. కేసీఆర్ బాటలో నడుస్తున్న గులాబీ కార్యకర్తలు పార్టీ పండుగ అంటే తమ ఇంట్లో పండుగని ప్రకటిస్తున్నారు. ఆనాడు శిథిలమైన తెలంగాణకు ఊపిరినివ్వడానికి ఎన్నో అవమానాలు, బెదిరింపులు, ఛీత్కారాలు, కేసులు ఎదుర్కొని నిలబడి ఏండ్లుగా పోరాడి తెలంగాణ రాష్ట్ర సాకారమే లక్ష్యంగా కదిలిన కేసీఆర్కు ఎప్పటిలాగే జేజేలు పలకడానికి గ్రేటర్ ఈ నెల 27న బయలెళ్లనుంది.
ఈ మేరకు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్చార్జీలు ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో సమావేశం జరిగింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు గ్రేటర్ గులాబీదళం అధిక సంఖ్యలో కదలాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు పదేండ్లు స్వర్ణయుగం చూశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ప్రజలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ భవన్లో మంగళవారం ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, నియోజకవర్గ ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారీ బహిరంగ సభకు గ్రేటర్ నుంచి అధిక సంఖ్యలో గులాబీదళం తరలి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణకు మొదటి సీఎంగా అద్భుతమైన పరిపాలన అందించారని చెప్పారు. 27న జరిగే పండుగ తమ ఇంట్లో పండుగగా ప్రతి ఒక్క కార్యకర్త భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగా నేడు, రేపు గోషామహల్, నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ శ్రవణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం జరుగుతుందని వివరించారు. 13న నియోజకవర్గాల మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. 20న తెలంగాణ భవన్లో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని చెప్పారు. 27న ప్రతీ డివిజన్లో గులాబీ జెండా ఎగురవేసి వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు బయల్దేరుతామని వెల్లడించారు. ఇప్పటికే ప్రజలందరూ కేసీఆర్ సభకు హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు.