“బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ మార్గాన తెలంగాణ రాష్ట్రం పయనిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్లంతా కారు గుర్తుకు ఓటేసి మరో మారు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని నాంపల్లి, యాకుత్పురా, గోషామహల్, చాంద్రాయణ గుట్ట, మలక్పేట నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్ పార్టీ నుంచి బీ ఫామ్ అందుకున్న అభ్యర్థులు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ పని తీరును, సంక్షేమం, అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకెళ్లి యువత నుంచి వయోజనుల దాకా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేలా కృషి చేస్తామని అభ్యర్థులు వీర తిలకం దిద్దుకుని విజయం దిశగా పయనిస్తున్నారు.”
సైదాబాద్, నవంబర్ 7: యాకుత్పురా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సామ సుందర్ రెడ్డికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటిఆర్ అందజేశారు. పాతబస్తీ యాకుత్పురా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా విజయం సాధించాలని మంత్రి కేటీఆర్ ఆశీర్వదించి ఆకాంక్షించారు. ఎమ్మెల్యే అభ్యర్ధి సామ సుందర్ రెడ్డి తన సతీమణి ఐఎస్ సదన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్నాసుందర్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్కు వెళ్లి ఆయన బీఫామ్ను అందుకున్నారు. ఈ సందర్భంగా సామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లభ్ధిదారులే పాతబస్తీలో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల ఫలాలను పొందిన వారందరూ తమ ఓటును కారు గుర్తుకు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్నాసుందర్ రెడ్డి, మెట్టు భాస్కర్ రెడ్డి, కార్తీక్, శివ తదితరులు పాల్గొన్నారు.
కార్వాన్, నవంబర్7: కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ మిత్ర క్రిష్ణ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పురపాలక, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్నారు. ఈ సందర్బంగా మిత్ర క్రిష్ణ మాట్లాడుతూ తన సేవలను గుర్తించడంతో పాటు తనపై నమ్మకంతో పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తాను జియాగుడా కార్పొరేటర్గా రెండు పర్యాయాలు ప్రజలకు సేవలందించానని ఈ క్రమంలో కార్వాన్తో మంచి అనుబంధం ఉందన్నారు. తనను కార్వాన్ ప్రజలు ఆదరించి విజయాన్ని అందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అబిడ్స్, నవంబర్ 7: గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి నందకిశోర్ వ్యాస్ బిలాల్ను పార్టీ అధిష్టానవర్గం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నందకిషోర్ వ్యాస్ బిలాల్కు బీ ఫామ్ అందజేశారు. వ్యాస్ తన కూతురు బేగంబజార్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పూజ వ్యాస్తో కలిసి బీ ఫామ్ను అందుకొని మంత్రి కేటీఆర్కు పుష్పగుచ్ఛాన్ని అందించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపి విజయంతో తిరిగి రావాలన్నారు. నందకిశోర్ వ్యాస్ బిలాల్ మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన పేరును ఖరారు చేసిన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మున్సిపల్, ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని, హోం శాఖ మంత్రి మహమూద్ అలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించి ఓట్లను అభ్యర్థిస్తానని తెలిపారు.
మెహిదీపట్నం నవంబర్ 7: నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ పేరును పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ఆనంద్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్నారు. తనపై పార్టీ నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు రుణపడి ఉంటానని ఆనంద్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడానికి నిరంతరం కృషి చేశామని, తన పనితీరును గుర్తించి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆనంద్ కుమార్ గౌడ్కు పార్టీ రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించి గెలుపు కోసం కృషి చేస్తానని ఆనంద్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
చాంద్రాయణగుట్ట, నవంబర్ 7: చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బీ ఆర్ఎస్ అభ్యర్థిగా ముప్పిడి సీతారాంరెడ్డికి ఐటీ శాఖ మం త్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం బీ-ఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకురాలు శోభారెడ్డి, లలితాబాగ్ డివిజన్ అధ్యక్షుడు జమ్మిచెట్టు రాజు, నరేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మలక్పేట, నవంబర్ 7: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ మలక్పేట నియోజకవర్గ అభ్యర్థి తీగల అజిత్రెడ్డి బుధవారం బీ ఫామ్ను అందుకున్నారు. ఆయనతో పాటు పక్కన మాజీ కార్పొరేటర్ తీగల సునరితారెడ్డి కూడా ఉన్నారు.