బేగంపేట్/బన్సీలాల్పేట్, డిసెంబర్ 3: సనత్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. 41,827 ఓట్ల మెజార్టీతో తలసాని భారీ విజయం సాధించి విజయ దుందుభి మోగించారు. నియోజకవర్గంలో మూడోసారి విజయం సాధించి సరికొత్త చరిత్రను సృషించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 30,651 మెజార్టీ సాధించగా.. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధిక మెజార్టీతో విజయం సాధించారు.
రెండవ స్థానంలో బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్రెడ్డి, మూడవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ నిలిచారు. సనత్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో నిర్వహించారు. ప్రతి రౌండ్లోనూ తలసాని తన ఆధిక్యతను చాటుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రిటర్నింగ్ అధికారి కిషన్రావు చేతుల మీదుగా దానం నాగేందర్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గెలుపునకు సహకరించిన నియోజకవర్గం ప్రజలు, ఓటర్లు, పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.
సనత్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్ గెలుపొందడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని అమీర్పేట్, బేగంపేట్, సనత్నగర్, మోండామార్కెట్, బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్ డివిజన్లలో పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, శేషుకుమారి, ఆకుల రూపల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. జై శీనన్న అంటూ నినాదాలు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధికంగా తరలివచ్చి సంబురాలు జరుపుకున్నారు. దీంతో ప్రాంగణమంతా గులాబీమయంగా మారింది.
తన గెలుపు సనత్నగర్ నియోజకవర్గ ప్రజల గెలుపేనని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ కామర్స్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడారు. తాను గెలిచానన్న ఆనందం కంటే రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోతున్నామనే బాధ అధికంగా ఉందన్నారు. తన గెలుపునకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని తలసాని తెలిపారు.
సనత్నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్యాదవ్ చేపట్టిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి అన్నారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లుగా నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వచ్చిన తలసానిని మూడవ సారి కూడా ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారన్నారు. ఓయూలోని ఎన్నికల కౌంటర్ దగ్గర పార్టీ శ్రేణులతో కలిసి తలసాని విజయోత్సవ సంబురాల్లో పాల్గొన్నారు.
– అమీర్పేట్, డిసెంబర్ 3