కొండాపూర్, మార్చి 25 : ప్రజలే నా బలగం… బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ క్రిస్టల్ గార్డెన్స్లో కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ‘బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం’ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు.
రూ. 8500 కోట్ల నిధులతో..
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రూ. 8500 కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మంచినీటి పైపులైన్లు, వీధి దీపాలు, విద్యుత్ సమస్యలను దాదాపుగా పరిష్కారించామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, రైతు బంధు, దివ్యాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్లను అందిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
సర్కారు దవాఖానల్లో మెరుగైన సేవలు
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలందిస్తున్నామని, గతంలో కొండాపూర్లోని జిల్లా దవాఖానలో నెలకు 30 ప్రసవాలయ్యేవని, ప్రస్తుతం 300లు అవుతున్నాయన్నారు. గర్భిణులు, బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చందానగర్, మియాపూర్ డివిజన్లను రూ. 380 కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. లింగంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలోని అండర్పాస్ సమస్యకు నిపుణులతో చర్చించి ఏప్రిల్, మే నాటికి శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అరెకపూడి గాంధీ అందిస్తున్న సేవలు, చేస్తున్న అభివృద్ధి పనులతో ప్రజలు మరోసారి పట్టం కట్టడం ఖాయం. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఏటా 10వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
–డాక్టర్ రంజిత్రెడ్డి, ఎంపీ
మహిళలకు చేయూతనిచ్చేలా..
చందానగర్ డివిజన్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. డివిజన్ పరిధిలో వందల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.డివిజన్లోని మహిళలకు చేయూతనిచ్చేలా నూతన మహిళా కమిటీ భవనాలు, మహిళా కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం.
– మంజుల రఘునాథరెడ్డి, చందానగర్ కార్పొరేటర్
అభివృద్ధికి ఆకర్షితులై..
ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పాలన, చేస్తున్న అభివృద్ధి, పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యాం. నాతో పాటు నా అనుచరులు ఎమ్మెల్యే గాంధీ, ఎంపీ రంజిత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో ముందుకు సాగుతూ మా వంతుగా ప్రజలకు సేవలందిస్తాం.
– దొంతి రాధమ్మ, చందానగర్
వరద నీటి సమస్య తీరింది
కొద్దిపాటి వర్షం పడితే శివాజీనగర్, శివాజీనగర్ వీకర్ సెక్షన్ కాలనీల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వరద నీటి సమస్యతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. గతంలో మంచినీళ్ల కోసం వారం పాటు ఎదురు చూసే వాళ్లం. ప్రస్తుతం అలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సమస్యలు పూర్తిగా తొలగిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నారు.
–ఉరిటి వెంకట్రావు, సీనియర్ నాయకుడు, శివాజీనగర్
ఏండ్లుగా తీరని సమస్యకు పరిష్కారం..
చందానగర్ భవానీపురం ప్రజలు ఎదుర్కొంటున్న సివరేజీ మురుగు నీటి సమస్య ఏండ్లుగా తీరకుండా ఉండిపోయింది. సమస్యను పరిష్కరించాలంటూ గతంలో అనేక మంది నాయకుల వద్దకు తిరిగినా.. ఫలితం లేకుండాపోయింది. కార్పొరేటర్ మంజుల రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ సహకారంతో పరిష్కారమైంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాలనీలోని చాలా వరకు ఇబ్బందులు తొలగిపోయాయి.
–సుందర్, భవానీపురం కాలనీ
అభివృద్ధికి కేరాఫ్గా..
తెలంగాణ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి కేరాఫ్గా పాలన కొనసాగుతున్నది. డ్రైనేజీ, వరద మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. నియోజకవర్గ ప్రజలు మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
– యాదగిరిగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు