జూబ్లీహిల్స్ జోన్,అక్టోబర్ 22 ; జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకత్వం మొత్తం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పోరేషన్ చైర్మన్లతో పాటు అన్ని నియోజకవర్గాలకు చెందిన కీలకనేతలంతా ఉత్సాహంగా నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ను గెలిపించాలని కోరుతున్నారు.
వెంగళరావునగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆసక్తిగా చదువుతూ కెమెరాకు చిక్కారు.
మాగంటికి చెప్పిన వెంటనే పనులు జరిగేవి
పౌర సమస్యలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులనైనా నేరుగా మాగంటికి పంపితే చాలు.. నిర్ణీత సమయంలోపు పరిష్కారమయ్యేవి. వర్షాకాలంలో వరద కష్టాలు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సమస్యలు వెంటనే తీర్చేవారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో స్థానికంగా మాగంటి చేపట్టిన అభివృద్ధి పనులు కోకొల్లలు. పేదల బస్తీలు, కాలనీలకు మాగంటి
మరణం తీరని లోటు.
– అఫ్సర్, సుల్తాన్నగర్, ఎర్రగడ్డ