కేపీహెచ్బీ కాలనీ, మార్చి 20 : మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిందేమీలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రాజకీయంగా భిక్ష పెట్టిన మల్కాజిగిరి పార్లమెంట్ను మరిచి కొడంగల్లో అభివృద్ధి పనులకు రూ.3,500 కోట్లు కేటాయించారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బుధవారం కూకట్పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పదేండ్లుగా తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్వన్గా అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ముందు చూపుతో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దారన్నారు. స్థానికేతరుడైన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు బుద్ధి చెప్పాలన్నారు. ఐదేండ్లుగా ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మల్కాజిగిరి అభివృద్ధిని ఎంత మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లిలో వచ్చేనెల 2 నుంచి 15వ తేదీ వరకు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు.