సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) /మేడ్చల్/సికింద్రాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు కోలాహలంగా జరిగింది. హైదరాబాద్ స్థానానికి 2, సికింద్రాబాద్ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తొలుత సికింద్రాబాద్ టకారాబస్తీలోని తన నివాసం నుంచి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్ , ముఠా గోపాల్ , మాగంటి గోపీనాథ్ , కాలేరు వెంకటేశ్లతో కలిసి వెస్ట్ మారేడ్ పల్లి లోని జీహెచ్ఎంసీ జోనల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు.
జోనల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సికింద్రాబాద్ అదనపు కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ పాటిల్ హేమంత్ కేశవ్కు పద్మారావుగౌడ్ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఇక్కడి సమస్యలపై గళం విప్పి పోరాడుతానన్నారు. పద్మారావు గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు.