మేడ్చల్, మార్చి7(నమస్తే తెలంగాణ): మన ముందు తరం స్వాతంత్య్రం కోసం పోరాడారు… మా తరం తెలంగాణ కోసం పోరాటం చేశాం… ఇప్పుడు మహిళలు 33 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… మహిళలు సాఫ్ట్వేర్ లాగా ప్రతిరోజు అప్డేట్ కావాలన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థినులు రాజకీయాల్లోకి వచ్చి సమాజాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ పని గంటల్లో సమానత్వం సాధించుకునేలా ఉద్యమించాల్సిన అవసరమున్నదన్నారు.
చాలా చోట్ల నెగెటివిటీ ఉంది. అది మీ వల్ల (విద్యార్థులనుద్దేశించి) వచ్చింది కాదు. ఆ నెగెటివిటీ సృష్టించిన వారి సమస్య అది. వారెవరో మిమ్మల్ని ఏదో అంటే మీరు మీ మనసు పాడుచేసుకోవద్దు. దారిలో పోతుంటే పిచ్చికుక్కలు అరుస్తూ ఉంటాయి. అది కుక్క ప్రాబ్లమ్. మన ప్రాబ్లమ్ కాదు. కామెంట్లకు కుంగిపోకుండా ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లాలని, ఇదే ఉత్తమమైన ఆయుధమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్లు పెడితే ఆన్లైన్లో ఫిర్యాదులు చేయాలని, ఇందుకు మల్లారెడ్డి యూనివర్సిటే వేదిక కావాలన్నారు. మహిళలు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొని పరిష్కరించుకోవాలని సూచించారు.
-ఎమ్మెల్సీ కవిత
సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు వారికి పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మేయర్ తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వారి సామర్థ్యాన్ని బట్టి ఎదిగేందుకు ప్రోత్సహించాలని, భవిష్యత్తులో మహిళలు పురుషుల కంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మనమే కంపెనీలు స్థాపించి వేయి మందికి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఎమ్మెల్సీ కవిత సూచించారు. మనకు వచ్చే ఐడియా ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉంటే టీ హబ్, వి హబ్, టీ వర్క్ ద్వారా కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సహకారం తీసుకొని యువ ఇంజినీర్లు రాణించాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవితకు మంత్రి మల్లారెడ్డి, మహిళలు, విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. అలాగే విద్యార్థినులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవితను ఘనంగా సన్మానించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూసాపేటలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు తన పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పాటిమీది జగన్మోహన్ రావు మాట్లాడుతూ… మహిళలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. బాల్య వివాహాలను అరికట్టడానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళా, శిశు సంరక్షణకు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, నూట్రీషన్ కిట్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం మహిళలకు పాటిమీది జగన్మోహన్ రావు చీరలను పంపిణీ చేసి సన్మానించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బోయిన్పల్లి, పికెట్, మారేడ్పల్లిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలు పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. అలాగే మహిళలకు సుమారు 2వేల చీరలు పంపిణీ చేశారు. ఆరో వార్డు బోర్డు మాజీ సభ్యుడు విద్యావతి పాండుయాదవ్, బోర్డు మాజీ సభ్యురాలు నళినీకిరణ్, పెద్దాల శారదా నర్సింహ యాదవ్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
-కంటోన్మెంట్, మార్చి 7
వెంగళరావునగర్, మార్చి 7 : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంగళరావునగర్ డివిజన్ సిద్థార్థ నగర్ కాలనీ కమ్యూనిటీహాల్లో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ హాజరయ్యారు. అనంతరం దివ్యమార్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ నేర్చుకున్న 75 మంది మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో దివ్యమార్గం ఫౌండేషన్ అధ్యక్షురాలు దివ్యారెడ్డి, న్యాయవాదులు కుమారస్వామి, రాంమోహన్ రెడ్డి, మహిళా సంక్షేమ సేవా దళం నేషనల్ ప్రెసిడెంట్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. విద్యార్థినుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బాలికల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళలు శక్తి వంతులని వారు అనుకుంటే సాధించలేనిది ఏది లేదన్నారు. మహిళలను గౌరవించడం మన అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్లు మహేందర్రెడ్డి, షాలినిరెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రవీణ్రెడ్డి, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వీఎస్కే. రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవీలత పాల్గొన్నారు.
-మంత్రి మల్లారెడ్డి