జవహర్నగర్, ఆగస్టు 10: రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదని.. జపాన్ దేశంలో ఎలాగైతే రిటైర్మెంట్ ఉండదో… నాకు అలాంటిదే వర్తిస్తుందని, నేను రిటైర్మెంట్ తీసుకుంటానని అనలేదనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జవహర్నగర్ కార్పొరేషన్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతటా విద్యాసంస్థలను నెలకొల్పి యువతకు నాణ్యమైన విద్యనందిస్తానని అన్నారు.
బీజేపీ, తెలుగుదేశం పార్టీల్లోకి పోతానని తాను చెప్పలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. జవహర్నగర్ నాకు గుండెకాయలాంటిదని, పేద ప్రజలు నివసించే ప్రాంతానికి జీవో 58, 59ద్వారా ఇళ్లను క్రమబద్ధీకరించి యాజమాన్య హక్కులు కల్పించామని పేర్కొన్నారు. డంపింగ్ దుర్వాసను వెదజల్లకుండా రూ. 144కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాపింగ్ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నలుదిక్కుల మినీ డంపింగ్యార్డ్లను ఏర్పాటు చేస్తామని చేయకపోవడం దారుణమన్నారు.
జవహర్నగర్ ప్రధాన రహదారి… అబిడ్స్ మోడల్ను తలపిస్తుందని, రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని మిషన్ భగీరథతో రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్, కేటీఆర్లకే దక్కుతుందని తెలిపారు. 28మంది కార్పొరేటర్లు జవహర్నగర్లో ఉద్యమంలా పనిచేసి కార్పొరేషన్ను అద్భుతంగా తీర్చిదిద్దారని, అలాంటి జవహర్ నగర్ను జీహెచ్ఎంసీలో కలుపుతామనడం బాధాగా ఉందన్నారు.
జవహర్నగర్ అభివృద్ధికి అండగా ఉంటానని, ప్రజలకు సేవ చేయడంలో తృప్తి ఉంటుందన్నారు. మాజీ మేయర్ కావ్య, పార్టీ అధ్యక్షుడు కొండల్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జవహర్నగర్ అధ్యక్షుడు సుధాకర్చారి, నాయకులు రాజశేఖర్, మహేశ్, ఎల్లస్వామి, సాదిక్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.