మన్సూరాబాద్, డిసెంబర్ 11: యాబై ఏండ్ల క్రితం అన్యాక్రాంతమైన భూముల విషయంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని బాధ్యుడిని చేసి విమర్శించడం బీజేపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, హయత్నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి, బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు జక్డిడి మల్లారెడ్డి తెలిపారు. మన్సూరాబాద్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. యాబై ఏండ్ల క్రితం సర్వే నం.51 కింద 2 ఎకరాల 10 గుంటల ఎక్సైజ్ శాఖకు చెందిన స్థలం ఉండేదని.. దానిని కొంద రు యాబై ఏండ్ల క్రితం సర్వేనం. 51/1, 51/2 కింద తమ స్థలంగా పరిగణిస్తూ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తెలిపారు. సర్వేనం. 51/1, 51/2ల స్థలంలో విషయంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వెళ్లినప్పటికీ సదరు స్థలంకు చెందిన రిజిస్టేషన్లు ఉన్న వారికే అది చెందుతుందని తీర్పు వచ్చిందని తెలిపారు. ఇప్పటికీ సర్వేనం. 51/2లో 2 వేల గజాల ఎక్సైజ్ శాఖకు చెందిన స్థలం ఖాళీగా ప్రభుత్వం ఆధీనంలో ఉందని తెలిపారు.
అక్రమ కట్టడాలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అనుమతులు ఇప్పిస్తున్నారంటూ బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ భూముల విషయంపై బీజేపీ నాయకులు ఆరు నెలల క్రితం ఆరోపణలు చేసినప్పుడే పత్రికా ముఖంగా సమాధానం చెప్పామని తెలిపారు. జోనల్ కమిషనర్ ఏవైనా నిర్మాణాలకు అనుమతులు ఇస్తే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఆర్టీఐ యాక్ట్ కింద దరఖాస్తు చేసుకుని ప్రస్తుతం కట్టడాలు జరుగుతున్న భూములు ప్రభుత్వానివా లేక ప్రైవేటు వ్యక్తులవా అనే విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవచ్చునని తెలిపారు. బీజేపీ నాయకుల వద్ద సాక్ష్యాలు ఉంటే ఎక్సైజ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయవచ్చు లేక కోర్టులకు వెళ్లవచ్చునని తెలిపారు. జోనల్ కమిషనర్ ఒకవేళ తప్పు చేసినట్లయితే ఫిర్యాదు చేయాలే కానీ సదరు భూముల విషయంలో ఎలాంటి సంబంధం లేని ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపారు.
ఎల్బీనగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని విమర్శించేందుకు ఏమిలేక బీజేపీ నాయకులు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఇలాగే వ్యవహరిస్తే మీ చరిత్రలు బయటకు తీసి ప్రజలు ముందు ఉంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడెం మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస రావు, బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్యాదవ్, బీఆర్ఎస్ బీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు రుద్ర యాదగిరి, నాయకులు జగదీశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.