ఎర్రగడ్డ, జూన్ 29: కాంగ్రెస్ కార్పొరేటర్ ఒత్తిళ్లకు తలొగ్గిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ దళితుడి ఇంటికి తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. సదరు ఇంటికి వేసిన సీజ్ను తొలగించాలని కోర్ట్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే అధికారులు ఆ ఉత్తర్వులను పట్టించుకోవటం లేదు. ఫలితంగా బాధిత కుటుంబం 2 నెలలుగా ఉండటానికి ఇల్లు లేక వీధిన పడింది. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమోహన్ దీన పరిస్థితి ఇది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణమోహన్కు బోరబండ డివిజన్ వినాయకరావు నగర్లో 75 గజాల స్థలంలో చిన్న ఇల్లు ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న ఆయన అప్పుచేసి ఇంటి పునర్నిర్మాణాన్ని చేపట్టాడు.
అయితే ఆ ఇంటిపై స్థానిక కాంగ్రెస్ నేతల కండ్లు పడ్డాయి. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరాలని స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్.. కొన్నినెలలుగా కృష్ణమోహన్పై ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిళ్లకు తలొగ్గని కృష్ణమోహన్పై కసి పెంచుకున్న కార్పొరేటర్ బల్దియా అధికారులను పావులుగా వాడుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల నిర్మాణంలో ఉన్న కృష్ణమోహన్ ఇం టికి వచ్చిన అధికారులు అనుమతుల పేరుతో 2 ఫ్లోర్లను పాక్షికంగా ధ్వంసం చేశారు. తదనంతరం 2 నెలల క్రితం ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఆ ఇంటి గేటుకు తాళాలు వేసి సీజ్ చేశారు.
దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. కృష్ణమోహన్ ఇంటికి వేసిన సీజ్ను తొలగించాలని ఈనెల 18న కోర్టు ఆదేశించింది. కోర్ట్ ఆదేశాల మేరకు తన ఇంటికి వేసిన తాళాలు, సీజ్ను తొలగించాలని కోరుతూ బల్దియా టౌన్ప్లానింగ్ అధికారులను కోరాడు కృష్ణమోహన్. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. చేసేదిలేక కృష్ణమోహన్ 10 రోజులుగా తన కుటుంబంతో కలిసి రోజు తన ఇంటిముందు కూర్చుని గేటు తాళాల తొలగింపు కోసం ఎదురు చూస్తున్నాడు.
అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయటం.. ఇంటి గేటుకు వేసిన తాళాలు, సీజ్ను తొలగించకపోవటం వెనుక అధికారులపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాంగ్రెస్ కార్పొరేటర్ కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు తమ వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టారనటంలో సందేహం లేదు. ఉండటానికి ఇల్లు లేక గత 2 నెలలుగా తాము పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదని బాధితుడైన కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు.