మెహిదీపట్నం ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ అన్నారు. దేశానికే తెలంగాణ తలమానికంగా ఉందని చెప్పారు. శనివారం నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్నగర్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అధ్యక్షతన మందులగూడలో జరిగింది. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా కొనసాగుతున్నదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు నిరంతరాయంగా అందుతున్నాయని చెప్పారు. శ్రేణులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి.. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాంపల్లి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. బీఆర్ఎస్ను అప్రతిష్టపాలు చేసే కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలను పార్టీ నాయకులు తిప్పి కొట్టాలన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని దాసోజు శ్రవణ్ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడంతో పాటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ.. డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గం ఇన్చార్జి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా..
దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, మన ఊరు-మన బడి, రైతు బంధు, దళితబంధు, బస్తీ దవాఖానలు ఇలా.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజల్లో వెలుగు నింపుతున్న నేత సీఎం కేసీఆర్ అని దాసోజు శ్రవణ్ అన్నారు. ఒక వైపు అభివృద్ధి చేస్తూనే మరో వైపు సంక్షేమ పథకాలు, ఫార్మా డెవలప్మెంట్, పరిశ్రమలు, ఐటీ, రోడ్లు, నాలాల అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్య బట్టారు. మూడు లక్షల కోట్ల ఆదాయం ఇచ్చే తెలంగాణపై అమిత్ షా, మోదీల కన్ను పడిందని, ఈ రాష్ట్ర సంపదను దోచి పెట్టి అదానీకి కట్ట బెట్టాలని కుట్ర చేస్తున్నారని, సింగరేణిని అమ్మాలని చూస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ ఖజానాను దోచుకోవడానికి బీజేపీ పాగా వేయాలని చూస్తున్నదని, ఇలాంటి వారికి సరైన జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి రమేశ్,నాంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్, కో ఆర్డినేటర్ ప్రదీప్కుమార్ అగర్వాల్, నాయకులు సంజయ్,అబ్దుల్ కలీం,మురళీధర్, డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ధరమ్వీర్సింగ్, భానుచందర్, విజయ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.