ఎల్బీనగర్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని బీఆర్ఎస్ ఎల్బీనగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కర్మన్ఘాట్ వంగ శంకరమ్మ గార్డెన్స్లో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ రూ. 10 కోట్లతో బంజారా భవన్ నిర్మించారన్నారు. తండాలను గ్రామపంచాయతీలను చేసిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని అన్ని సర్వేలు సూచిస్తున్నాయని, బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదని, కాంగ్రెస్కు క్యాడర్ లేదని అన్నారు.
తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. దేశం మొత్తంలో రెండు సార్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. పేద వర్గాలకు రూ. 200 ఉన్న పించన్లను రూ. 2వేలకు పెంచడంతో పాటు 45 లక్షల మందికి ఆసరా పించన్లు ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్దేనని, ఆరు ఏండ్ల కాలంలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడి సాయం అందించి ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయం అందించాలని, కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గిరిజనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.