ఎర్రగడ్డ, అక్టోబర్ 22: ప్రతి పేద కుటుంబానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బోరబండలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మైనార్టీలు సహా అడుగడుగునా గోపీనాథ్కు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల మ్యానిఫెస్టో వివరాలున్న కరపత్రాలను ఆయన పాదయాత్ర చేస్తూ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ పేద కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన సీఎం కేసీఆర్కు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అదనంగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మోసపూరిత హామీలను గుప్పిస్తున్న పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. 9 ఏండ్లలో తెలంగాణ సాధించిన ఘన కీర్తిని వక్రీకరించే విపక్షాలకు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. ప్రచార పర్వంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, లక్ష్మణ్గౌడ్, ఆనంద్కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.