Congress | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర పరిధిలో అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర నిరాశకు గురైన అధికార కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే వాతావరణం ఎదురవుతున్నది. అభ్యర్థుల ఎంపికలోనే తడబాటుకు గురైన అధిష్ఠానానికి ఆపై క్షేత్రస్థాయిలోనూ ఆశించిన అనుకూలత కనిపించడంలేదు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆదిలోనే ఎదురీత మొదలైంది.
ముఖ్యంగా ఈ మూడు స్థానాల్లోనూ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువా కప్పిన వారినే అభ్యర్థులుగా ప్రకటించడంతో హస్తం శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం వ్యక్తమవుతున్నది. కొన్నిచోట్ల నిరసన గళం వ్యక్తమవుతుండటంతో అధిష్ఠానం అంతర్మథనంలో పడిపోయింది. గెలుపు బాట దేవుడెరుగు… ముఖాముఖి పోటీలో ఉంటామా? లేదా? అనే మీమాంస కూడా ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నది.
సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నాంపల్లి మినహా మిగిలిన ఆరు స్థానాలు గులాబీ పార్టీనే కైవసం చేసుకోగా, మిగిలిన స్థానం మజ్లిస్ ఖాతాలోకి వెళ్లింది. అంటే ఏడు స్థానాల్లో ఎక్కడా కాంగ్రెస్, బీజేపీల ఊసే లేదు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అభ్యర్థి ఎంపికనే ఒక సవాల్గా మారింది. ఎవరూ దొరకకపోవడంతో చివరకు బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ను పార్టీలోకి తీసుకొని, అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో సొంతగూటిలోనే అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. అధికారం ఉన్నంత వరకు బీఆర్ఎస్లో ఉండి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఇక్కడ తిష్టవేస్తే తమ పరిస్థితి ఏందంటూ క్యాడర్ అధిష్ఠానంపై కన్నెర్ర జేశారు.
పంజాగుట్ట మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ ఒక అడుగు ముందుకేసి.. దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పోటీ చేయాలని డిమాండు చేయడంతో పాటు పార్టీ ఫిరాయింపుపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రం, దానం అభ్యర్థిత్వాన్ని ప్రజలే కాదు చివరకు సొంత పార్టీవారే వ్యతిరేకిస్తుండటంతో అధిష్ఠానం దిక్కుతోచని పరిస్థితిలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. మరోవైపు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఐదేండ్లు నగరానికి ఏమీ చేయలేదనే అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావు లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగడంతో ప్రత్యర్థి పార్టీల్లో గుబులు మొదలైంది. నిత్యం ప్రజల మధ్య నిరాడంబరంగా ఉండే పద్మారావు కొన్ని దశాబ్దాలుగా నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ దూకుడుకు ఇక్కడ అడ్డుకట్ట లేకుండా పోయింది.
దేశంలోనే అతి పెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి స్థానం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో పాటు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహించిన స్థానం కావడం మరో విశేషం. దీని పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాలనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. పైగా భారీ మెజార్టీలు కూడా ఇక్కడ వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అభ్యర్థి కరువ్వడంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన సునీతా మహేందర్రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి బరిలో నిలిపారు. కానీ ఆమె ఇక్కడ కొత్త ముఖం కావడంతో పార్టీ క్యాడర్లోనే నైరాశ్యం వ్యక్తమవుతున్నది.
ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రచారంలోనూ ఆ పరిస్థితులే ప్రతిబింబిస్తున్నాయి. ఇక… బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఈటల రాజేందర్కు మేడ్చల్ అసెంబ్లీ మినహా మిగిలిన ఆరు శాసనసభ పరిధుల్లో పెద్దగా సంబంధాలు లేవు. అదనంగా బీజేపీకి ఈ లోక్సభ పరిధిలో పెద్దగా బలం కూడా లేదనేది గత ఎన్నికల ఫలితాల్లోనే తేలింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఫలాలు కూడా అందుకుంటున్న ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
చేవెళ్ల లోక్సభ స్థానంలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ ఆదిలోనే ఎదురీదుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, మూడు కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే కాంగ్రెస్లో అసలు అభ్యర్థి దొరక్కపోవడంతో చివరకు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డిని తీసుకొని కాంగ్రెస్ కండువా కప్పి అభ్యర్థిగా ప్రకటించారు. వాస్తవానికి బీఆర్ఎస్ బలంతోనే రంజిత్రెడ్డి విజయం సాధించారేగానీ అసలు ఆయనకు సొంత బలం ఎక్కడిది? ఎందుకు అభ్యర్థిగా ప్రకటించారు? అని కాంగ్రెస్ వర్గాల నుంచే సూటిపోటి మాటలు వినిపిస్తున్నాయి.
దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి సహకారమే లభించడం లేదు. పైగా ఇక్కడ అంతో ఇంతో పట్టున్న ‘పట్నం’ కుటుంబం మల్కాజిగిరిలోనే ఎదురీదుతుండటంతో పరిస్థితి ఇంకా ప్రతికూలంగా మారింది. మరోవైపు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి బరిలో నిలవగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో బీజేపీ ఒక్క దానిని సైతం కైవసం చేసుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ లోక్సభ పరిధిలో గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉండటం కాషాయదళాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. ఇక.. బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న కాసారా జ్ఞానేశ్వర్కు 96 బీసీ కులాల గొంతుకగా రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుంది. దీనికి తోడు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు.