మణికొండ, ఆగస్టు 29 : రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు. ఉమ్మడి పాలనలో అప్పటి సీమాంధ్ర పాలకులు నియోజకవర్గంలో ఉన్న భూములను వేలం వేసి వచ్చిన సొమ్మును ఎక్కడో ఖర్చు చేసేవారు. ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించిన దాఖలాలు చాలా అరుదు. సమీపంలో జంట జలాశయాలున్నా తాగునీటికి ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. కానీ స్వరాష్ట్ర పాలనలో శాశ్వత తాగునీటి పరిష్కారం, చెరువులకు పూర్వకళ, నూతన విద్యాభవనాలు, కోట్లు అంటే కోకాపేటగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఇప్పుడు అధునాతన నగరానికి వేదికగా మారింది. గడిచిన తొమ్మిదేండ్లలో ఈ నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో అత్యంత క్రేజ్ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వేలాది మందిని అక్కున చేర్చుకున్నది. మూడు పర్యాయాలు వరుసగా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నమస్తే తెలంగాణతో పలు విషయాలను పంచుకున్నారు.
ప్రతి బస్తీలో ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా అక్కడి ప్రజలు నాకు ఫోన్ చేసి చెబుతారు. వెనువెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తున్నా. నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ చేసేందుకే. అభివృద్ధి విషయంలో నియోజకవర్గాన్ని ఒక కుటుంబంగా చూస్తాను. బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రతీ ఒక్క గడుపకు చేరాలన్నదే నా లక్ష్యం. మా ప్రాంత అభివృద్ధికి ప్రజా సేవకుడిగా పని చేస్తున్నా. నేను చేసిన అభివృద్ధిపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.
నియోజకవర్గంలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం లేకుండా, ఇవ్వకుండా అభివృద్ధి చేశా. నేనే వాళ్లను ప్రశ్నిస్తున్నా.. 75 ఏండ్ల స్వాతంత్య్ర పాలనలో మీరు చేసిందేమి. గడిచిన పదేండ్లలో ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే కన్పిస్తోంది. సమస్యలు చాలా అరుదు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో మాత్రమే కన్పిస్తాయి. నిరంతరం ప్రజలతోనే ఉండి పనిచేస్తున్నా. ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి గెలుస్తా. అభివృద్ధి మంత్రం, సర్కారు పథకాలు, ప్రజల ఆశీస్సులే నా విజయానికి దోహదం చేస్తాయి.
ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయి. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీబంధు, మైనార్టీలకు ఆర్థిక సహాయం లాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అనే నమ్మకం,విశ్వాసం ప్రజల్లో ఉంది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనం.
60 ఏండ్లలో గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో చేసి చూపించా. మరోసారి నన్ను గెలిపిస్తే స్థానిక ఐటీ కంపెనీల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన, విద్యాభివృద్ధికి ప్రత్యేక చొరవ, జంట జలాశయాల చుట్టూ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ జోన్లు, కోకాపేట, బండ్లగూడ, శంషాబాద్ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేస్తా. మహిళాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటా.
చాలా సంతోషంగా ఉంది. నా సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ సార్ మరోసారి అవకాశమిచ్చారు. నేను ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని గుర్తించారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను బతికున్నంత కాలం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా. నా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిగా పని చేస్తా.
ప్రజల ఆశీస్సులతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను. నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికే కృషి చేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్, యువ నాయకుడు, ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ పరిధిలో కోకాపేట, మణికొండ లాంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటు, శంషాబాద్లో విమానాశ్రయం, అవుటర్ రింగ్రోడ్డులు, ఈ ప్రాంతానికి అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టా. మౌలిక సదుపాయాల కల్పన, శాశ్వత తాగునీటి సౌకర్యాలు, రహదారుల విస్తరణలో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అభివృద్ధికి చిరునామాగా రాజేంద్రనగర్ నిలిచింది. అద్భుతమైన సర్కారు సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందేలా చేశా. చేస్తూనే ఉంటా.