బడంగ్పేట (హైదరాబాద్) : మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్(BRS)లోకి వలస బాట పడుతున్నారు. తాజాగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23 డివిజన్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కోఆప్షన్ సభ్యురాలు గుర్రం ప్రసన్న వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha reddy) సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ (CM KCR) ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. నియోజక వర్గంలో అభివృద్ధి చేసిన వారిని ఓటర్లు ఆశీర్వదిస్తారన్నారు. కొత్తగా వస్తున్న వారిని నమ్మవద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. మహేశ్వరం నియోజక వర్గంలో అనేక కంపెనీలు తీసుకు వస్తానని , దీని వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
అనంతరం వీఎం హోం మైదానంలో వాకర్స్ను కలిసి కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. విజయపురి కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. హుడా కాంప్లెక్స్లో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.