కంటోన్మెంట్, ఏప్రిల్ 9: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా మర్రి రాజశేఖర్రెడ్డి నియమితులయ్యారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం చెందడంతో గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో నెలకొన్న సందిగ్ధానికి తెర దించుతూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తున్న మర్రి రాజశేఖర్రెడ్డికే అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో మర్రి ఓటమి పాలైనప్పటికీ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధితో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మర్రి రాజశేఖర్రెడ్డి యాక్టివ్గా పనిచేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా పోరాడుతున్నారు. నియోజకవర్గంలో మిగతా నాయకులను సమన్వయం చేసుకుంటారని భావించి అధిష్టానం మర్రి రాజశేఖర్రెడ్డిని ఎంపిక చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నియోజకవర్గ ఇన్చార్జిగా మర్రి రాజశేఖర్రెడ్డి ఎంపికపై ఆయన వర్గీయులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మర్రి..
కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా నియమితులైన మర్రి రాజశేఖర్రెడ్డి… బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతంతో పాటు పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేశానని, తన సేవలను గుర్తించారని మర్రి రాజశేఖర్రెడ్డి చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధితో పాటు కంటోన్మెంట్లోని కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గోషామహల్కు నందకిశోర్ వ్యాస్..
అబిడ్స్, ఏప్రిల్ 9 : గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా నందకిశోర్ వ్యాస్ బిలాల్ నియమితులయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నందకిశోర్ వ్యాస్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనపై ఎంతో నమ్మకం ఉంచి నియోజకవర్గ పార్టీ బాధ్యతలను అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి అందరి సమన్వయంతో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు పాటుపడతానన్నారు. ఈ పదవి దక్కేందుకు కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.