BRS | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గ్రేటర్కు నాలుగు పార్లమెంటు స్థానాలతో అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచారు. పలు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఇప్పటికే మొదలవ్వగా.. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తయ్యేలా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి, బీఆర్ఎస్ మధ్య ఓట్ల శాతం స్వల్పంగానే తేడా ఉండటం.. కాంగ్రెస్, బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం బీఆర్ఎస్కు అనుకూలిస్తాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతలతో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.
బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మకంగా ఎంపీ స్థానాలకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించారు. చేవెళ్ల స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు, సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్లను అభ్యర్థులుగా ప్రకటించారు. గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. వ్యూహాత్మకంగా చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలకు బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లోని అన్ని స్థానాలను గెలుచుకుని బీఆర్ఎస్ సత్తా చాటింది. అదే ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లోనూ మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకునేలా గులాబీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రస్తుత ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. అన్ని వర్గాల సంక్షేమాన్ని సైతం విస్మరించడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.
పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నది. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఒక విడుత అన్ని నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో చేసిన దిశానిర్దేశం మేరకు గ్రేటర్కు చెందిన నేతలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే మహేశ్వరం, పరిగి నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహించారు. ఈ నెల 26న తాండూరులో, 27న రాజేంద్రనగర్లో, 30న శేరిలింగంపల్లిలో, ఏప్రిల్ 1న చేవెళ్లలో, 3న వికారాబాద్లో సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మరోసారి సమావేశాలు నిర్వహించేలా వ్యూహ రచన చేస్తున్నారు. అభ్యర్థులు సైతం ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలను కలిసి గెలుపునకు కృషి చేయాలని కోరుతున్నారు. కేసీఆర్తో భారీ బహిరంగ సభల నిర్వహణకు సంబంధించి రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తుండటంతోపాటు రోడ్ షోలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సమావేశం తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నారు.