రంగారెడ్డి, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ఒక్క రూపాయి నిధులివ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. మహేశ్వరం ప్రాంతంలో నిర్వహించిన సభలకు మోదీ, అమిత్షా, నడ్డాలు పలుమార్లు వచ్చి వెళ్లారని, పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఇన్నిసార్లు వచ్చి ఈ ప్రాంతానికి ఇచ్చిందేమీ లేదని విమర్శించారు.
మొదటి నుంచీ మోదీ తెలంగాణ రాష్ట్రం అంటేనే విషం కక్కుతారని, తెలంగాణకు వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలను తిట్టడం తప్పితే రాష్ర్టానికి ఇది చేశాము! అది చేస్తాం? అని ఏనాడైనా ప్రజలకు చెప్పారా? అని ప్రశ్నించారు. దేశమంతా మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో ఐటీఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం వల్ల ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవని, మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీఐఆర్ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసి యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని ఆరోపించారు. పదేపదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ నేతలు కేంద్రం తెలంగాణ రాష్ర్టానికి ఏం ఇచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఐటీఐఆర్ను రద్దు చేయడం వల్ల ఈ ప్రాంతానికి నష్టం జరిగిందా? లేదా? గుండెపై చెయ్యి వేసుకుని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఇచ్చారని, ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ను రూ.400కే ఇచ్చేందుకు మ్యానిఫెస్టోలో పొందుపర్చారని పేర్కొన్నారు.
నాపై పోటీకి నిలబెట్టాలంటే ఢిల్లీ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల్లో చర్చలు జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సబితమ్మ వెనుక ఉన్న బలగాన్ని చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయని అన్నారు. సోనియా, రాహుల్ ఈ ప్రాంతంలో సభలు పెట్టారని, సబితమ్మను ఓడించాలంటే ఇంత మంది రావాలా? అని అన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు బీజేపీ, కాంగ్రెస్లు తనను ఏమీ చేయలేవని పేర్కొన్నారు.