KTR | మేడ్చల్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీతోనే పోటీ ఉంటుందని, మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై ప్రసంగించారు. మల్కాజిగిరి ప్రాంతానికి ఏ మాత్రం సంబంధంలేని అభ్యర్థిని చేవెళ్లలో రిజక్ట్ చేస్తే ఇక్కడికి తీసుకువచ్చి మల్కాజిగిరి ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన డమ్మీ అభ్యర్థికి ఓటు వేస్తే అది బీజేపీకే లబ్ధి జరుగుతుందన్నారు. డమ్మీ అభ్యర్థికి మల్కాజిగిరి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని కోరారు.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడానికి వస్తున్నారని, 10 ఏండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం మల్కాజిగిరి ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ర్టాభివృద్ధికి సహకరించని బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు మెడికల్ కాలేజీలు వచ్చాయని, తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, అభివృద్ధి కోసం రక్షణ భూములు అడిగితే ఇవ్వలేదని, నవోదయ, సైనిక్ స్కూళ్లను మంజూరు చేయలేదని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించక పోవడంతోనే బీఆర్ఎస్కు నష్టం జరిగిందని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు తెలిసే విధంగా అన్ని విషయాలను తెలియ పర్చాలని కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నేరవేర్చాల్సిందేనని, వెంటపడుతామని, నిద్రపోనియ్యమని హెచ్చరించారు. రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ నాయకులను భయాందోళనకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. భయంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని తనకు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడ్చల్ నియోజకవర్గంలో నిరుపేదలకు చెందిన వేలాది ఇండ్లను కూల్చి వేసిందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు క్యాడర్ లేదు, లీడర్లు లేరని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు మల్కాజిగిరి ప్రజలు తగిన బుద్ది చేబుతారని చెప్పారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని అన్నారు.
వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు. వంద రోజులైనా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. గడిచిన పదేండ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని చెప్పారు. ఐటీ రంగంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. మల్కాజిగిరికి పార్లమెంట్ ఎంపీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏమీ చేశారని ప్రశ్నించారు. కనీసం నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు లేవని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్క అవకాశం కల్పిస్తే.. మల్కాజిగిరిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, మేయర్ జక్క వెంకట్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భోజనం చేశారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భాస్కర్ ఇస్తాడు