గోల్నాక, ఏప్రిల్ 30 : గత ఐదేండ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి పైసా పని చేయలేదని., ప్రచారానికి వస్తే ఓటు ఎందుకు వేయాలో ప్రశ్నించాలని సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్ ప్రజలను కోరారు. మంగళవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో అంబర్ పేట డివిజన్ న్యూపటేల్ నగర్, నరేంద్రనగర్, చెన్నారెడ్డినగర్, బాపూనగర్ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గం సమన్వయకర్త దాసోజు శ్రావణ్, కార్పొరేటర్ విజయ్కుమార్ గౌడ్, అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, బీఆర్ఎస్ నేతలు దూసరి శ్రీనివాస్ గౌడ్, ఎర్రబోలు నరసింహ రెడ్డి, ఆంజనేయులు తదితరులతో పాటు వందలాది గులాబీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే.. గెలుపు ఖాయమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.