సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ) : ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల దూకుడు కొనసాగుతున్నది. నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. గడిచిన రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ప్రజలతో మమేకమై అలుపెరగకుండా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అభ్యర్థులకు అడగడుగునా డప్పు చప్పుళ్లు, బతుకమ్మ ఆటలు, పూలవర్షంతో సాదరస్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది శాలువాలు, పూలమాలలతో ఘనస్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుతున్నారు. అభ్యర్థులు కూడా పదేండ్లలో జరిగిన అభివృద్ధి కళ్ల ఎదుటే ఉన్నాయని, మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగేందుకు మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానులు, ప్రేమను ఎన్నటికీ మరువలేమని అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలుకరిస్తూ.. ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా, కాలనీలు బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేయాలన్న గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాల ప్రకారం అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే అస్ర్తాలుగా సాగుతూ లబ్ధిదారులు, వారి కుటుంబాలతో పాటు ప్రజల నుంచి ఆశీర్వాదం పొందుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు 65 ఏండ్లు పాలించిన అభివృద్ధి జరుగలేదని, గడిచిన పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ప్రతిపక్ష పార్టీలకు మచ్చెమటలు పట్టిస్తున్నారు. వాడలు, బస్తీలు, కాలనీలను చుట్టేసి అన్ని వర్గాల మద్దతును కూడగడుతూ ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. దాదాపు రెండు నెలల గులాబీ శ్రేణుల ప్రచార శైలితో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మా సాయన్న బిడ్డవు..తప్పకుండా గెలుస్తావు
నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా పికెట్ రాంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దివంగత సాయన్న స్నేహితుడు నర్సింగ్రావు ఇంటి సమీపంలోకి పాదయాత్రగా వస్తున్న లాస్యనందితకు మద్దతు తెలిపేందుకు బయటకు వచ్చే ప్రయత్నంలో కిందపడిపోయాడు. నర్సింగ్రావు ఇంటికి చేరుకున్న లాస్యనందిత నర్సింగ్రావును చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆపరేషన్కు కావాల్సిన నిధులను సీఎంఆర్ఎఫ్ నుంచి వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పెద్దాయన మాట్లాడుతూ మా సాయన్న కూతురువు.. తప్పకుండా ఎన్నికల్లో గెలుపు నీదే అంటూ.. ఆశీర్వదించారు.