కంటోన్మెంట్, మే 28 : ప్రతిపక్ష పార్టీలు బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడో వార్డు మడ్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సబ్బండ వర్ణాల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తున్నదన్నారు. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల ఆదరణకు నోచుకోని తెలంగాణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శవంతమైన పరిపాలనతో కంటోన్మెంట్ ప్రాంతం నేడు వసతుల కల్పనలో ఇతర పట్టణాలతో పోటీ పడుతున్నదని చెప్పారు.
ప్రతిపక్షాలవి చౌకబారు మాటలు..
బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు మాయమాటలతో ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నాయని మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ఆ పార్టీలు ప్రజల జీవన విధానాలను మెరుగుపర్చలేక పోయాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చౌకబారు మాటలు మాట్లాడుతున్నాయని వాటిని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు కల్యాణలక్ష్మి, వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల ఆసరా పెన్షన్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఈ ప్రాంత ప్రజలకు 15 రోజులకోసారి తాగునీరు సరఫరా అయ్యేదని… మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. కంటోన్మెంట్ గులాబీ జెండా అడ్డా అని…రానున్న బోర్డు, సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 95 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
బలమైన శక్తిగా బీఆర్ఎస్..
65 లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి ఏమిటో, ప్రత్యేక తెలంగాణకు ముందు రాష్ట్రం ఎలా ఉండేదో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నాగేశ్, మన్నె క్రిషాంక్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, అనితా ప్రభాకర్, నేతలు శ్రీగణేశ్, ముప్పిడి మధుకర్, ప్రవీణ్యాదవ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.