దుండిగల్/కుత్బుల్లాపూర్,ఏప్రిల్16: సుభిక్ష తెలంగాణలో బీజేపీ విషప్రచారాలను బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని శాననమండలి విప్ శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి సప్తపది గార్డెన్లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై ప్రసంగించారు. మోదీ పాలనలో పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం పడిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను బడా వ్యాపారసంస్థలకు అప్పగిస్తూ..దేశ ఆర్థిక రంగం సంక్షోభంలో పడేలా బీజేపీ పరిపాలనను కొనసాగిస్తుందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
కార్యకర్తలకు అండగా గులాబీ జెండా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గులాబీ జెండా అండగా ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆరు వేల కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామన్నారు. గడపగడపకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధిని ప్రజలకు వివరించేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా అనుక్షణం వారి సంరక్షణ కోసం తాను సిద్ధంగా ఉన్నానని భరోసాను ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతామన్నారు.
కేసీఆర్ పాలనపై దేశ ప్రజల ఆసక్తి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి
యావత్ దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ పరిపాలనపై ఆసక్తిగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బీజేపీని ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపారెడ్డి, డిప్యూటి మేయర్ ధన్రాజ్యాదవ్తో పాటు ఫ్లోర్లీడర్ ఆగంపాండు ముదిరాజ్, కార్పొరేటర్లు, కౌన్సిల్ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.