ఎన్నికల సమరంలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ‘కారు’ టాప్గేర్లో దూసుకుపోతున్నది. ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం కారుకు ఎదురు నిలువలేక బేజారవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో తొలి జాబితా ప్రకంపనలు సృష్టిస్తుంటే, కమలం పార్టీలో తొలి జాబితా కోసం కండ్లు కాయలు కాసేలా ఆశావహులు ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, బీఫామ్లు కూడా అందించారు. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు తొలి దశ ప్రచారాన్ని కూడా ముగించారు. దీంతో విజయోత్సాహంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. రెండో విడత ప్రచారాన్ని పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ గడప గడపకు తీసుకెళ్తుంటే… ప్రతిపక్ష పార్టీలు మాత్రం పత్తా లేకుండా పోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లో నెలకొన్న నిస్తేజ పరిస్థితులతో క్యాడర్ అమోమయంలోకి వెళ్లిపోగా.. మరికొందరు గులాబీ కండువా కప్పుకుంటున్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ )
సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమరంలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ‘కారు’ టాప్గేర్లో దూసుకుపోతున్నది. బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఎవరో తేల్చక బీజేపీ పార్టీ, ప్రకటించిన తొలి జాబితాతోనే అసంతృప్తి జ్వాలతో కకావికలమవుతున్న కాంగ్రెస్ మరోవైపు ఉంటే….అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే తొలి దశలో నియోజకవర్గాన్ని చుట్టేసిన గులాబీ అభ్యర్థులు..రెండో విడతలో గడపగడపకు పాదయాత్రలు చేపడుతున్నారు. అసంతృప్తి అనేది లేకుండా అందరూ ఒక్కతాటిపైన కలిసికట్టుగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ విపక్ష పార్టీలకు వణుకు పుట్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో గులాబీ ప్రచారం పండగ వాతావరణంలో కొనసాగుతుండగా..బరిలో ప్రతిపక్ష పార్టీ అనేది మచ్చుకైనా కనబడడం లేదు. షెడ్యూల్ వెలువడి 11 రోజులు గడిచినా.. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల పోరులో తడబడుతున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో నెలకొన్న నిస్తేజ పరిస్థితులతో క్యాడర్ అమోమయంలో వెళ్లిపోగా..మరికొందరు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు ప్రతిపక్షాలు కుదేలవుతున్న పరిస్థితి.
గుర్తుల గుర్తుంచుకో రామక్కా.. అడ్డగుట్టలో కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలకు సూచిస్తున్న
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
హ్యాట్రిక్ పక్కా.. : సనత్నగర్ నియోజకవర్గంలో గడపగడపకు పాదయాత్ర చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
బీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డికి బీఫాం రావడంతో మల్కాజిగిరి చౌరస్తాలో పటాకులు కాలుస్తున్న గులాబీ శ్రేణులు
ఓవైపు బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతూ ఏకఛత్రాధిపత్యం చాటుతుంటే… కారు వేగానికి బీజేపీలో ఆశలు చచ్చుబడుతున్నాయి. అభ్యర్థులు, అధికారం దేవుడెరుగు నియోజకవర్గ స్థాయిలో పార్టీ ఎన్నికల కార్యాచరణ, తొలి జాబితానైనా ప్రకటించండి బాబూ అంటూ ..అసహనంతో ఆ పార్టీ నేతలు ఊగిపోతున్నారు. అయితే రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం అందుకు భిన్నంగా అభ్యర్థుల ప్రకటనకు సమయం ఉందంటూ.. మరింత జాప్యం చేయడంతో గ్రేటర్ పరిధిలో నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోకు జనాల నుంచి అనూహ్య స్పందన వస్తుంటే.. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంలో జాప్యం చేస్తున్నారు. కనీసం బూత్ స్థాయి కమిటీల హడావుడి లేదని పలు నియోజకవర్గాల్లోని పలువురు బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి కంటే ముందు కనీసం పార్టీనైనా జనాల్లోకి తీసుకుపోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇదే తీరుగా పార్టీ వ్యవహరిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో ఉన్న కొద్దిపాటి బలాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని సొంత పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు.
ఇక.. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు వెంగళరావు, సత్యంశ్రీరంగం, నాగిరెడ్డి, గాలి బాలాజీ, పద్మారావు, యుగేంధర్రెడ్డితో పాటు పలువురు నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. గురువారం బాలానగర్లోని సామ్రాట్ ప్రెసీడెన్సీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పద్మారావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనకు కూకట్పల్లి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఒకవేళ స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తే కూకట్పల్లిలో సామూహిక నామినేషన్లు వేస్తామన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షతన వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు యుగేంధర్రెడ్డి సైతం స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గులాబీ నేతలంతా కలిసికట్టుగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరిస్తూ..ఓటు అభ్యర్థిస్తూ.. ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా, కాలనీల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేయాలన్న గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాల ప్రకారం.. అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే అస్ర్తాలుగా సాగుతూ లబ్ధిదారులు, వారీ కుటుంబాలతో పాటు ప్రజల నుంచి ఆశీర్వాదం పొందుతున్నారు. ఒకవైపు పాదయాత్రలు , మరో వైపు బూత్ లెవల్ ఎజెంట్లతో ప్రత్యేకంగా సమావేశమై భారీ మెజార్టీ లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ను పెంచారు.
కూకట్పల్లి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు జరిగినా.. బీఆర్ఎస్ పార్టీదే సంపూర్ణ ఆధిపత్యం. మరోసారి కూకట్పల్లిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి..హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా కదనరంగంలో మాధవరం కృష్ణారావు దూసుకుపోతున్నారు. షెడ్యూల్ కంటే ముందే పాదయాత్రలతో నియోజకవర్గాన్ని చుట్టేసిన ఆయన.. ప్రజలకు మరింత చేరువయ్యారు. అయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలో బలమైన అభ్యర్థులు లేక వలస పక్షుల (ప్యారాచ్యూట్) కోసం వెతుకుతున్నారు.
బీజేపీలో పన్నాల హరీశ్రెడ్డి, మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వర్రావు, ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్, కంచి మహేందర్తో పాటు పలువురు నేతలు అవకాశమివ్వాలని అధిష్టానం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కానీ, అధిష్ఠానం నేతలు మాత్రం బయటి వ్యక్తులను బరిలోకి దింపడానికి ఆసక్తి చూపుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల్లో కృష్ణారావుపై పోటీచేసి ఓడిపోయిన కాంతారావు, హరీశ్రెడ్డిలో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొత్తగా పార్టీలో చేరిన రాజేశ్వర్రావు, ప్రేమ్కుమార్కు టికెట్లు ఇస్తే పార్టీ వర్గాలన్నీ దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తున్నది. బయట నుంచి బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, మరో నేత విజయశాంతి పేర్లు వినబడుతున్నాయి. ఒకవేళ కొత్తవారికి అవకాశం ఇస్తే.. ఈ నేతలంతా మూకుమ్మడిగా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్థానికేతరులకు కేటాయించడంతో టికెట్ను ఆశించిన ఆశావహులు గురువారం గాంధీభవన్లో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. టీపీసీసీ నాయకులు సుధీర్కుమార్ తివారి, వినయ్కుమార్ ముదిరాజ్, కన్ను పహిల్వాన్, శ్రీధర్ గౌడ్, సంజయ్ యాదవ్, రణ్ధీర్ ఠాకూర్, నర్మదసింగ్ తదితరులు టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. అధిష్ఠానం మాత్రం సునీతా రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘న్యాయం చేయండి.. గోషామహల్ బచావో.. కాంగ్రెస్ బచావో.. గోషామహల్ కాంగ్రెస్ టికెట్ను స్థానికులకు కేటాయించాలి.. అని ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు.
వివాదాస్పద వీడియోతో పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజాసింగ్ నగరంలో అశాంతికి ఆజ్యం పోసేలా ఒక వీడియోలో అనుచిత వ్యాఖ్యలు చేయడం… దీనిపై బీజేపీ అధిష్ఠానం స్పందించి, రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ ఈ వ్యవహారంపై ఏ మాత్రం స్పందించని బీజేపీ అధిష్ఠానం.. తాజాగా సస్పెన్షన్ ఎత్తివేతకు యోచిస్తున్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు బలాన్ని చేకూర్చేలా గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని ఒక సందర్భంగా మీడియా రాజాసింగ్ సస్పెన్షన్ను ప్రస్తావించగా… అది తమ అంతర్గత వ్యవహారంగా అభివర్ణించారు. అంతేకాదు… సస్పెన్షన్ ఎత్తివేస్తే రాజాసింగ్ పోటీలో ఉంటాడంటూ సంకేతాలివ్వడం గమనార్హం. జాబితా సిద్ధం కాగానే చెబుతామని వ్యాఖ్యానించడమంటే ఆ దిశగా అడుగులు పడుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.